Political War in Station Ghanpur Constituency : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తమనే వరిస్తుందంటూ.. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఇరు వర్గాల కార్యకర్తలు సైతం.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.
ఘన్పూర్లో కడియం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు.. రాజయ్య వర్గీయులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వర్గీయులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో.. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి.. ఈసారీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో జనగామ జిల్లాలో బీఆర్ఎస్ స్థానిక నేతలు రెండు శ్రేణులుగా విడిపోయారు.