Basavatharakam Cancer Hospital Anniversary Celebrations 2023 : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి తెలంగాణ సర్కార్.. ఎంతగానో సహకరిస్తోందని ఆస్పత్రి ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆస్పత్రి 23వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య.. 2000 సంవత్సరంలో బసవతారకం ఆస్పత్రి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల మంది రోగులకు సేవ చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రీలీల, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెటర్ ప్రణవి చంద్ర పాల్గొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేసే లక్ష్యంతో ఆస్పత్రి నడుపుతున్నామన్న బాలయ్య.. క్యాన్సర్ రోగులకు సేవ చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బసవతారకం ఆస్పత్రి ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. క్యాన్సర్ రోగులు ధృఢంగా ఉండి వ్యాధి నుంచి కోలుకోవాలని పీవీ సింధు కోరారు. కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ జయించిన వారిని, ఆస్పత్రికి విరాళాలు అందించిన దాతలను బాలకృష్ణ సత్కరించారు.
'ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. మా అమ్మ బసవతారకం కోరికతో ఆసుపత్రి ఏర్పాటు చేశాం. ఆస్పత్రిలో కొన్ని కొత్త పరికరాలు ప్రారంభించాం. నేను కూడా గతంలో మెడికల్ ఎంట్రన్స్ రాశాను. సీటు రాదని తెలిసినా నాన్న కోరిక మేరకు రాశాను. దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా నిలిచింది. సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే' అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.