T20 World Cup : టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ అద్భుత విజయం సాధించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ (82*) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్య (40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతామనుకొన్న మ్యాచ్ను చివరి వరకూ క్రీజ్లో నిలబడి గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ అవార్డు అందుకొన్నాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "ఇదొక అద్భుతమైన వాతావరణం. ఇలాంటి సమయంలో మాటలు రావడం లేదు. ఇది ఎలా జరిగిందో ఐడియా రావడం లేదు. ఎందుకంటే నేను పదాలు మరిచిపోయా. మనం సాధించగలమని హార్దిక్ నమ్మాడు. చివర వరకూ క్రీజ్లో ఉంటే సాధ్యమేనని అనుకొన్నాం. పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసిన షహీన్ షా అఫ్రిదిని టార్గెట్ చేయాలని భావించాం. అలాగే హారిస్ రవుఫ్ వారికి చాలా కీలక బౌలర్. ఒక్కసారి హారిస్ను ఎటాక్ చేస్తే తప్పకుండా పాక్ ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. చివరి ఓవర్ నవాజ్ వేస్తాడు ముందే అనుకొన్నాం. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన తరుణంలో రెండు సిక్స్ కొట్టడం నిజంగా అద్భుతం. చివరికి 6 బంతుల్లో లక్ష్యం 16కి వచ్చింది. నా శక్తిసామర్థ్యం మీద నమ్మకం ఉంచా. ఇప్పటి వరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్ నా అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజా ఇన్నింగ్స్ వచ్చి చేరింది. హార్దిక్ చాలా మద్దతుగా నిలిచాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం అద్భుతం. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు." అని తెలిపాడు.
"నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. కానీ, ఎప్పుడూ కంటితడి చూడలేదు. తొలిసారి పాక్ మీద విజయం తర్వాత ఇవాళ చూశా. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన" హర్షా భోగ్లే వ్యాఖ్యలు.. పాక్ మీద అపూర్వ విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లు చెమర్చాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో చాలా కీలక ఇన్నింగ్స్లు ఆడిన విరాట్పై ఫామ్పై ప్రశ్నలు వస్తూనే ఉన్న నేపథ్యంలో.. ఇలా బాధ బయటకు వచ్చినట్లు అభిమానులు చెబుతున్నారు.