Governor Yadadri Visit: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం అనంతరం మొదటిసారిగా గవర్నర్ తమిళ్సై సౌందర్య రాజన్ దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్కు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్కు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని.. ఆలయ వంశపారంపర్యం ఛైర్మన్ బి.నరసింహ మూర్తి అందించారు. అనంతరం ఆలయమంతా కలియతిరిగి.. అద్భుతమైన కళాత్మక నిర్మాణాన్ని తమిళిసై పరిశీలించారు. సువర్ణశోభితమైన ఆలయ మండపంలో ఫొటోలు తీసుకున్నారు.
"ఉగాది పర్వదినాన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. యాదాద్రి దేవాలయాన్ని తెలుగు సంవత్సరాదిన దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తెలుగు, కన్నడ ప్రజలందరికి శుభాకాంక్షలు. ప్రజలందరికి.. వాళ్లు కోరుకున్నవన్ని నిర్విగ్నంగా జరగాలని.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నా." - గవర్నర్ తమిళిసై..