తెలంగాణ

telangana

కిటికీలే దొంగకు దారులు.. ఆటకట్టించిన పోలీసులు

By

Published : Jun 29, 2020, 3:23 PM IST

Updated : Jun 29, 2020, 3:31 PM IST

రాత్రి సమయాల్లో కిటికీ ఊచలు తొలగించి చోరీలకు పాల్పడుతున్న దొంగను వరంగల్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతికతను ఉపయోగించి దొంగను పట్టుకుని అరెస్టు చేసిన సీసీఎస్​ సుబేదారి పోలీసులను వరంగల్​ సీపీ విశ్వనాథ్​ రవీందర్​ అభినందించారు.

Warangal Police Solve Serial Theft Case
వరుస చోరీలు చేస్తున్న దొంగ ఆటకట్టించిన పోలీసులు

వరంగల్​ అర్బన్​ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను వరంగల్​ పోలీసులు పట్టుకున్నారు. రాత్రి సమయాల్లో ఇంటి కిటికీ ఊచలు తొలగించి చోరీలకు పాల్పడుతున్నాడు హన్మకొండకు చెందిన సయ్యద్​ కైసర్. నిందితుడిని వరంగల్ సీసీఎస్, సుబేదారి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో నిందితుడి కదలికలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.34 లక్షలు విలువ చేసే 637 గ్రాముల బంగారం, 1కిలో 180 గ్రాముల వెండి, 2 కెమెరాలు, 6 సెల్​ఫోన్లు, పాస్​పోర్ట్​, 1ట్యాబ్​, 7 చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు సయ్యద్​ కైసర్​ 2012లో ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఉపాధి కోసం ఆటో నడిపినప్పటికీ ఆదాయం సరిపోక.. హన్మకొండకు చేరుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో 2017 నుండి చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. కమీషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 14 చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు.

దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు వెళ్తున్న క్రమంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాకచక్యంగా దొంగను అదుపులోకి తీసుకున్న సీసీఎస్, సుబేదారి పోలీసులను సీపీ విశ్వనాథ్​ రవీందర్​ అభినందించారు. కేసులు ఛేదించడానికి పోలీసులు సాంకేతికతను మరింతగా ఉపయోగించాలని సూచించారు.

ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

Last Updated :Jun 29, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details