తెలంగాణ

telangana

Rains in Warangal: ఓరుగల్లును ముంచెత్తుతోన్న వర్షం.. స్తంభించిన జనజీవనం

By

Published : Sep 7, 2021, 12:03 PM IST

Rains in Warangal, floods in hanamkonda
ఓరుగల్లును ముంచెత్తుతోన్న వర్షం, వరంగల్ జలమయం

రాష్ట్రంలో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఓరుగల్లులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో(Rains in Warangal) జనజీవనం అతలాకుతలం అవుతోంది. హనుమకొండ జిల్లాలోని(rains in hanamkonda) పలు కాలనీలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తూ... రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి(Rains in Warangal). ఇళ్లలో నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్-ఖమ్మం(warangal-khammam road) ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, జలాశయాలు నిండి మత్తడి పోస్తున్నాయి. హనుమకొండలో(hanamkonda rains) భారీ వర్షాలతో కాలనీలు జలమయమయ్యాయి. వడ్డెపల్లి చెరువు నిండి పోయి ఆ నీరు అంతా హనుమకొండలోని నాలాల గుండా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కటాక్షాపూర్ చెరువు మత్తడి పోస్తుండటంతో హనుమకొండ-ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఓరుగల్లును ముంచెత్తుతోన్న వర్షం

స్కూల్​లో నిలిచిన వరద నీరు

కాశిబుగ్గలోని మధురానగర్ లక్ష్మీగణపతి కాలనీ, వివేకానంద కాలనీలు నీటమునగగా.. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ బృందావన కాలనీలో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో చిక్కుకుపోయిన వృద్ధులను వరంగల్ మహానగర పాలక సంస్థ డిజాస్టర్ టీం సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖిలా వరంగల్ రాతికోట సమీపంలోని అగర్తల మత్తడి పోయడంతో.... శివనగర్ మైసయ్య నగర్ కాలనీలోకి వరదనీరు చేరింది. ఉర్సు రంగసముద్రంతో పాటు భద్రకాళి జలాశయం అలుగు పారడంతో దిగువన ఉన్న కాపువాడ కాలనీ రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. వరంగల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో... పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. తరగతి గదిలోకి నీరు వచ్చి విద్యార్థుల పుస్తకాలు తడిసిపోయాయి. భారీగా వరద నీరు చేరడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపించి సెలవు ప్రకటించారు.

కాలనీలు జలమయం

సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయ్యాయి. కేయూ వంద ఫీట్ల రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమరావతి నగర్‌ కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాల్​పూర్, సమ్మయ్యనగర్, ద్వారక కాలనీ, ఎన్జీవో కాలనీ, గోకుల్ నగర్ తదితర కాలనీలో వరద నీరు చేరింది. వడ్డెపల్లి చెరువు నిండిపోయి ఆ నీరు అంతా హనుమకొండలోని నాలాల గుండా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోపాల్​పూర్ విద్యుత్ సబ్​స్టేషన్ నీట మునిగింది. దీంతో ఆ స్టేషన్ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాకపోకలు బంద్

ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో హనుమకొండ జిల్లా నుంచి ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చెరువు మత్తడి రోడ్డుపై ప్రమాదకరంగా పోతుంది. రాత్రి నుంచి వాన కురుస్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

చెరువులను తలపిస్తున్న రహదారులు

హనుమకొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐనవోలు మండలం రాంనగర్ గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరడంతో బకెట్లతో తొలగిస్తున్నారు. అలాగే పంతిని చెరువు ఉప్పొంగడంతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలమయం అయింది. నాలుగు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించడంతో ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీ వరదలో చిక్కుకుంది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. లారీని తొలగించేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:Rain Effect in Sircilla :సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద... స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details