తెలంగాణ

telangana

PM Modi Warangal Tour : ప్రధాని సభకు ముస్తాబవుతున్న ఓరుగల్లు... నోఫ్లై జోన్​గా పరిసర ప్రాంతాలు

By

Published : Jul 7, 2023, 7:21 AM IST

PM Modi Public Meeting In Warangal : ప్రధాని మోదీ రాక కోసం ఓరుగల్లు ముస్తాబవుతోంది. రేపు హనుమకొండలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానమంత్రి పర్యటించే ప్రాంతాలను భద్రతాబలగాలు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకోగా.. ఆయా ప్రాంతాల్లో గగనతలాన్ని పోలీసులు నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరోవైపు మోదీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు, జనసమీకరణలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు.

PM Modi Tour
PM Modi Tour

మోదీ సభకు ముస్తాబవుతున్న ఓరుగల్లు.. బీజేపీ భారీ ఏర్పాట్లు

Modi Public Meeting Arrangements In Warangal : వరంగల్‌ పర్యటనలో భాగంగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్నారు. శనివారం ఉదయం 7.35 గంటలకు వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరి.. ఉదయం 9.25గంటలకు హైదరాబాద్‌ హకీంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 10.15 గంటలకు వరంగల్‌లోని మామునూర్‌ ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గంలో భద్రకాళి దేవాలయానికి వెళ్లి ప్రధాని మోదీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయం నుంచి నేరుగా హనుమకొండ సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుని వ్యాగన్‌ పరిశ్రమ నిర్మాణానికి వర్చువల్‌గా భూమి పూజ చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బహిరంగసభలో మాట్లాడనున్నారు. అనంతరం 1.40 గంటలకు తిరిగి హకీంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ వెళ్లనున్నారు.

ప్రధాని రాకతో పోలీసుల పటిష్ఠ బందోబస్తు : ప్రధాని వరంగల్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు డీజీపీ.. పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, రోడ్లు, భవనాలు, రైల్వే తదితర శాఖలతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ ఇప్పటికే వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్‌గా పోలీసులు ప్రకటించారు. ట్రై సిటి పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

జన సమీకరణలో బిజీగా ఉన్న బీజేపీ నేతలు : కాగా హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మోదీ బహిరంగసభ కోసం బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక, ఇతర ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కాగా.. పార్టీ నేతలు జనసమీకరణలో తలమునకలయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఓరుగల్లుకు చేరుకున్న కమలం నేతలు.. ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఓరుగల్లు ప్రజల కల నెరవేర్చేందుకు ప్రధాని వస్తున్నారని.. మోదీ ప్రసంగం వినేందుకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల తెలిపారు.

"30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రిగా ఓరుగల్లు గడ్డ మీద అడుగుపెడుతున్నారు మోదీ. లక్షల మంది ప్రజలు మోదీ ఉపన్యాసం వినాలని.. వారిని చూడాలని కోరుకుంటున్నారు. ఈ సభను విజయవంతం చేస్తాం. వరంగల్‌కు జాతీయ రహదారులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పుడు ఈ వ్యాగన్‌ శంకుస్థాపనతో ఉపాధి అనేది దొరుకుతుంది." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే

PM Modi Warangal Meeting Arrangements : హైదరాబాద్‌ నుంచి ప్రధాని హెలీక్యాప్టర్‌లో రానున్నందున.. మామునూర్‌లో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులు హెలీక్యాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాలు, ల్యాండింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రావిణ్య, పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details