KTR at kitex texttile park:రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తూ.. పోతూ ఉంటారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో దమ్ బిర్యానీ తిని వెళ్లడమే తప్ప.. వారు గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. మెగా టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కీలక కంపెనీల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేశారని కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యిందని తెలిపారు.
దాదాపు రూ.12 వేల కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో కైటెక్స్ వస్త్ర పరిశ్రమ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుంది ఇందులో 8వేల మంది వరకు మహిళలకే అవకాశం ఇవ్వనున్నారు. కైటెక్స్ మెగా జౌళి పార్కుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో చలివాగు నుంచి నీరు అందించే మిషన్ భగీరథ పైపులైను, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.