Mini lift irrigation: ఏళ్ల తరబడి నిరాశలో కూరుకుపోయిన వనపర్తి జిల్లా రైతులు ప్రస్తుతం కృష్ణా జలాలు పొలాల్లో ప్రవహించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5.42 కోట్ల వ్యయంతో చేపట్టిన 54 చిన్నతరహా ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో జిల్లాలోని ఏడు మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 5,260 ఎకరాలు ప్రస్తుతం సాగులోకి వచ్చాయి.
జిల్లాలోని కొల్లాపూర్, పానగల్ మండలాల్లో మినీ లిఫ్టులను ఏర్పాటుచేశారు. వీటితో వేల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ప్రతీ గ్రామంలో మిట్ట ప్రాంతాల్లోని వందల ఎకరాలకు కాలువల ద్వారా సాగు నీరందించడం సాధ్యంకాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... చిన్న తరహా ఎత్తిపోతలను ఏర్పాటు చేయించారు. సమీపంలోని చెరువులు, కుంటలు, కాలువల్లో మోటార్లను ఏర్పాటు చేసి పైపులైన్ల ద్వారా కుంటలను నింపి పొలాలకు నీరు మళ్లిస్తున్నారు. తద్వారా వేల ఎకరాలకు నీరందుతోంది.
రైతుల పాలిట వరం
భూములు పనికి రావనుకున్న రైతులకు జిల్లాలో చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిర్మించడం వరంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా బీడుగా ఉన్న పొలాలు ప్రస్తుతం ఏడాదికి రెండు పంటలు పడి రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సాగునీటి వనరుల అభివృద్ధితో జిల్లాలో సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా పెరుగుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా కాలువల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు నీరందుతోంది. అవసరమైన చోట్ల కాలువలు తవ్వించి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపారు. ఈ క్రమంలో పలువురు రైతులు తమ పొలాలు ఎత్తు ప్రాంతాల్లో ఉన్నాయని, వాటికి సాగునీటి వసతి కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.