తెలంగాణ

telangana

NO MGNREGA For Chenchu Community : అడవిబిడ్డల ఉపాధిపై నీలినీడలు

By

Published : Feb 28, 2022, 1:24 PM IST

NO MGNREGA For Chenchu Community : అటవీ ప్రాంతంలో జీవించే చెంచుల వలసల నివారణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రత్యేక గ్రామీణ ఉపాధి హామీ పథకం అయోమయంగా మారింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే ఈ పథకం విలీనం చేయడంతో చెంచులు తమకు దక్కే ప్రయోజనాల్ని కోల్పోవాల్సి వస్తోంది. అడవుల్లోనే జీవించే చెంచులకు ఉపాధి పథకం ద్వారానే ఇన్నాళ్లు అభివృద్ధి ఫలాలు అందేవి. ఇప్పుడా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకోవటంతో వారి జీవనోపాధి పట్ల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NO MGNREGA For Chenchu Community
NO MGNREGA For Chenchu Community

అడవిబిడ్డల ఉపాధిపై నీలినీడలు

NO MGNREGA For Chenchu Community : చెంచుల్లో వలసలు తగ్గించి.. వారున్న చోటే ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చెంచు ఉపాధి హామీ పథకం నీరు గారింది. 2009లో శ్రీశైలం ఐటీడీఏలో చెంచుల కోసం కొన్ని వెసులుబాట్లతో ప్రత్యేక ఉపాధి పథకాన్ని అమలుచేసింది. శారీరకంగా బలహీనంగా ఉండే చెంచులు ఇతరులతో సమానంగా పనులు నిర్వహించ లేరనే కారణంగా, వారికి అదనపు పనిదినాల పాటు, 30 శాతం భృతి అదనంగా కల్పించారు.

చెంచుల ఆందోళన..

MGNREGA For Chenchu Community : తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీశైలం ఐటీడీఏ నుంచి మన్ననూరు ఐటీడీఏ కొత్తగా ఏర్పాటైంది. దీని పరిధిలో నాగర్ కర్నూల్‌, నల్గొండ జిల్లాలోని 12 మండలాలు, 123 చెంచు గూడాలు ఉన్నాయి. సుమారు 4వేల 93 కుటుంబాలు, 7 వేల 976 మంది చెంచులు ప్రత్యేక ఉపాధి పథకం ద్వారా లబ్ధి పొందేవారు. ఇందుకోసం ఐటీడీఏ పీవో, ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఏపీవోలు, సిబ్బంది చెంచుగూడేలకు వెళ్లి పథకాన్ని అమలు చేసేవారు. ఈ క్రమంలోనే చెంచుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. ప్రస్తుతం చెంచుల ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని.. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో విలీనం చేయడం, అమలు బాధ్యతను గ్రామ కార్యదర్శులకే అప్పగించడంపై చెంచు ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వలసలు తప్పేలా లేవు..

"ఉపాధి పని ఉన్నరోజులు వలసలు లేవు. ఇప్పుడు దీన్ని జనరల్​లో కలపడం వల్ల చెంచులు నష్టపోతారు. జనర్​లో అయితే 100 రూపాయలే వస్తాయి. చెంచు ప్రాజెక్టు కింద 130 రూపాయలు వస్తాయి. మా ప్రాంతంలో మొత్తం పెంటలే ఉన్నాయి. జనరల్​లో ఉన్న వాళ్లు ఈ పెంటల్లో పని చేయలేరు. కార్యదర్శులు అక్కడికి వెళ్లి పని కొలిచి డబ్బులివ్వలేరు. ఎలా చూసుకున్నా.. చెంచుల ప్రాజెక్టును జనరల్​లో కలపడం వల్ల చెంచులు చాలా నష్టపోతారు. మళ్లీ చెంచులు వలసలు ప్రారంభమవుతాయి."

- చెంచు సర్పంచులు

ప్రయోజనాలు కోల్పోతారు..

Chenchu Community Migration : చెంచుల ప్రత్యేక పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేస్తే.. వారికి ఇప్పటి వరకు దక్కిన ప్రయోజనాలను కోల్పోనున్నారు. ప్రత్యేక పథకంలో చెంచుల పనిదినాలు 180 కాగా.. ప్రస్తుతం వందరోజులే వర్తిస్తాయి. చెంచులకు అదనంగా చెల్లించే 30శాతం భృతి అందదు. 45 రోజుల వరకు స్వీకరించే మస్టర్లను ఇకపై 7 రోజులకే తీసుకుంటారు. ప్రత్యేక పథకం అమలు కోసం మండలానికి ఇద్దరు చొప్పున జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు కల్పించగా.. లోతట్టు అటవీ ప్రాంతాల్లో చెంచులు నిర్వహించే ఉపాధి పనులను జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు ప్రత్యేక వాహనంలో వెళ్లి పరిశీలించి కొలతలు నమోదు చేసేవారు. అటవీ ప్రాంతాల్లో చెంచులు నిర్వహించే పనుల పరిశీలన, తక్షణ చెల్లింపులు చేయడం గ్రామ కార్యదర్శులకు ఇబ్బందికరంగా మారనుంది.

ఉన్నతాధికారులకు విజ్ఞప్తి..

"నాగర్​కర్నూల్, నల్గొండ జిల్లాలో 10వేల జనాభా ఉంది. వీళ్ల కోసం చెంచు ప్రత్యేక ప్రాజెక్టు అమలయ్యేది, దీనివల్ల చెంచు కుటుంబాలకు ఏడాదికి 180 పనిరోజులు కల్పించేవాళ్లం. 30 శాతం అదనపు కూలీ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు ఈ పథకాన్ని జనరల్​లో కలపడం వల్ల చెంచులు నష్టపోయే అవకాశం ఉంది. మళ్లీ చెంచుల వలసలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టును ఇలాగే కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​కు విజ్ఞప్తి చేశాం. ఇది ఇలాగే కొనసాగేలా మా వంతు కృషి చేస్తాం."

- అశోక్, ప్రాజెక్టు మేనేజర్, ఐటీడీఏ, మన్ననూరు

అదే కొనసాగించాలి..

Chenchu Community in Mahbubnagar : ప్రభుత్వ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో చెంచులు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి నుంచి వస్తున్న డిమాండ్‌ల దృష్ట్యా.. చెంచుల ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న విధంగా కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్‌ను కోరినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు.

మళ్లీ వలసలు తప్పవు..

చెంచుల ప్రత్యేక గ్రామీణ ఉపాధి హామీ పథకం విలీనం చేస్తే జీవనోపాధి దూరమై మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details