తెలంగాణ

telangana

కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలడానికి కారణాలు ఏమిటంటే..!

By

Published : Mar 24, 2021, 8:57 AM IST

సూర్యాపేట కబడ్డీ పోటీల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం క్రీడాభిమానులకు శాపంగా మారింది. సోమవారం రాత్రి కబడ్డీ పోటీల సందర్భంగా గ్యాలరీ కుప్పకూలి సుమారు 200 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో 80 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉన్న 30 మందిని హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.

కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలడానికి కారణాలు ఏమిటంటే..!
కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలడానికి కారణాలు ఏమిటంటే..!

అనుభవం లేని గుత్తేదారుకు గ్యాలరీ నిర్మాణ పనులు అప్పగించడం వల్లనే సూర్యాపేటలో కబడ్డీ పోటీల సందర్భంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలమంది ప్రేక్షకులు వస్తారని తెలిసినా నిర్మాణంలో గుత్తేదారు తీవ్ర అలసత్వం వహించారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కనిపించనేలేదు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీకి పిల్లర్లు ఏర్పాటు చేయాలని, ఇసుప కడ్డీలకు పక్కాగా వెల్డింగ్‌ చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే గ్యాలరీలను కేవలం సెంట్రింగ్‌ కర్రలను అడ్డుపెట్టి వస్త్రాలతో కట్టడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఓ బాధితుడి వాంగ్మూలం మేరకు శివసాయి డెకరేషన్స్‌తోపాటు క్రీడల నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రత్యేకంగా ఎవరి పేరునూ స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం. ప్రమాదం తర్వాత గ్యాలరీలను మూసివేయడంతో ప్రేక్షకులు నిల్చొనే పోటీలను తిలకించారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి

ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులందరినీ ఆసుపత్రులకు తరలించామని వివరించారు. క్షతగాత్రులందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో 80 శాతంమంది ఇప్పటికే ఇళ్లకు వెళ్లారన్నారు.

ఇదీ చూడండి:పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం: సూర్యాపేట ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details