తెలంగాణ

telangana

Harish rao Dharna: 'జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చింది'

By

Published : Nov 12, 2021, 1:47 PM IST

Updated : Nov 12, 2021, 2:30 PM IST

కేంద్ర ప్రభుత్వం అతి తెలివిగా మాట్లాడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harish rao news) ఆరోపించారు. జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చిందని విమర్శించారు. సిద్దిపేటలో చేపట్టిన ధర్నాలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

Harish rao news, trs strike
హరీశ్ రావు, తెరాస ధర్నా 2021

దుక్కి దున్నే రైతు దుఃఖం తీర్చేందుకే ధర్నా చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish rao news) అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేశామని గుర్తు చేశారు. విద్యుత్, విత్తనాల సమస్యను పరిష్కరించుకున్నామని మంత్రి తెలిపారు. కలనా.. నిజమా అన్న స్థాయిలో ప్రాజెక్టులు పూర్తిచేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు ధర్నాకు(trs strike in telangana) దిగగా... సిద్దిపేటలో చేపట్టిన ధర్నాలో మంత్రి హరీశ్ రావు(Harish rao news) పాల్గొన్నారు.

రాష్ట్రం మంచిగ ఉంది... జర బాగు పడతం అంటే దిల్లీ వాళ్లు మా రైతుల మీద బాంబులు వేసినట్లుగా యాసంగిలో వడ్లు కొనం అంటున్నారు. తెలివిగా మాట్లాడుతున్నారు కొద్దిగా. మేం వడ్లు కొనం అనలేదు. బాయిల్డ్ రైస్ కొనం అన్నాం అంటున్నారు. దొడ్డు వడ్లు కొనం అంటారు. మరి తెలంగాణలో పండేటివే బాయిల్డ్ రైస్. ఇదేమన్న కొత్త ముచ్చటనా? అతి తెలివిగా మాట్లాడుతున్నారు. యాసంగి పంటలో మనకు ఎండలు ఎక్కువ. 35 డిగ్రీలు దాటితే రా రైస్ 50శాతం నూకలు అవుతాయి. అందుకే యాసంగిలో తెలంగాణలో పండే పంట దొడ్డు వడ్లు.

-హరీశ్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి

కేంద్ర ప్రభుత్వం అతి తెలివిగా మాట్లాడుతోందని.. మన దగ్గర పండని పంటలను కొంటామంటున్నారని అన్నారు. వ్యవసాయం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి తలవంచి సాగు మీటర్లు పెట్టారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో సాగు మోటార్లకు మీటర్లు పెట్టారని పేర్కొన్నారు. నల్లచట్టాలతో రైతులకు మద్దతు ధర దక్కకుండా కుట్ర చేశారన్న మంత్రి... ఏడాది నుంచి దిల్లీలో ధర్నా చేస్తున్నా కేంద్రంలో స్పందన లేదని మండిపడ్డారు. 600 మంది రైతులు చనిపోయినా కేంద్రంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చిందన్న హరీశ్... మార్పు రాకపోతే రైతుల ఆగ్రహానికి కమలం వాడిపోతుందని హెచ్చరించారు.

'జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చింది'

పంజాబ్​లో ఒక పంటే పండిస్తారు. రెండో పంట మార్చుకున్నారు అని అంటున్నారు. వాళ్లు మార్చుకోలేదు. అక్కడ వాతావరణ స్థితిగతులు అనుకూలించవు. మరి పంజాబ్​లో మొత్తం వడ్లు కొనడం ఎట్లా? మా తెలంగాణలో మొత్తం కొనకపోవడం ఎట్లా? అని తెరాస, రైతుల పక్షాన నేను ప్రశ్నిస్తున్నా. మీరు సమాధానం చెప్పాలి. ఒక్క వ్యవసాయం మీదనే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంత ఎవరు చేయలేదు. ఇది డైరెక్టుగా చేసేది. ఇంకా ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, చెరువులు వంటివి కూడా రైతు కోసమే. ఇంత పని చేసిన ప్రభుత్వం తెరాస మాత్రమే.

-హరీశ్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెరాస నేతలు ధర్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ధర్నాలు చేపట్టారు. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల నేతలు ఎడ్లబళ్లపై ఎక్కి నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:విమానంలోనే దర్జాగా స్మోకింగ్​- ఆంధ్ర వ్యక్తి అరెస్ట్​

Last Updated : Nov 12, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details