సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామాన్ని వచ్చే వానాకాలం వరకు విత్తనోత్పత్తి గ్రామంగా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడేలా రైతులకు అవగాహన కల్పించాలని ఫెస్టిసైడ్స్ డీలర్లను కోరారు. డీలర్ల శిక్షణకు న్యాయం జరగాలంటే.. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేయాలని అన్నారు. మేనేజ్ సహకారంతో దేశాయ్ కోర్సు పూర్తి చేసిన 40 మంది ఫెస్టిసైడ్స్ డీలర్లకు సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పండించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ పనిముట్ల కోసం రూ.1500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 28న ఆయిల్ ఫామ్ సాగుపై 2 వేల మంది రైతులతో వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ను మంత్రి ఆదేశించారు.