తెలంగాణ

telangana

KTR: 'సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త'

By

Published : Apr 17, 2023, 5:28 PM IST

KTR Rajanna Sircilla Tour: రైతు బీమా తెలంగాణ మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో సింహభాగం రాష్ట్రంలోనివేనని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాజన్నపేటలో వెనుకబాటు తనం ఉండటంతో స్వయంగా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

KTR
KTR

KTR Rajanna Sircilla Tour: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్తని.. అదే స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, రాజన్నపేట, బాక్రుపల్లి తండా, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రాజన్నపేట గ్రామంలో రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, రూ.33 లక్షలతో 'మన ఊరు మనబడి కార్యక్రమం' కింద పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా బీఆర్​ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజన్నపేట వెనకబడి ఉండటంతో దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజన్నపేట గ్రామంలోనే రూ.20 కోట్ల 38 లక్షలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశామన్నారు.

ఇళ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి డైనేజీలను నిర్మిస్తున్నామని తెలిపారు. కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్​లను వారం రోజుల్లోగా ఇస్తామన్నారు. రైతు భీమా పథకం తెలంగాణ మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. రైతు చనిపోతే బీమా ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వేమని గుర్తు చేశారు. లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేసినట్లు కేటీఆర్ తెలిపారు. బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

3 వేల 400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినట్లు తెలిపారు. దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాల్లో సింహ భాగం తెలంగాణ రాష్ట్రంలోనివేనని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీల్లో ఒక్కో గ్రామ పంచాయతీ భవనం రూ.20 లక్షలతో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్​లో ఆరు శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్​ను.. స్వరాష్ట్రంలో 10 శాతం పెంచామని గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని పోడు భూములు, లావని భూములకు సంబంధించి విస్తృత అధ్యయనం చేసి అర్హులందరికీ పట్టాలను అందజేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలలో గిరిజన భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

KTR: 'సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. అదే స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త'

ABOUT THE AUTHOR

...view details