తెలంగాణ

telangana

'రాష్ట్రంలో హనుమాన్​ గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు'

By

Published : Feb 28, 2023, 7:40 PM IST

Updated : Feb 28, 2023, 8:02 PM IST

KTR
KTR

KTR Sircilla Tour Update: కల్యాణలక్ష్మి, సీఎంఆర్​​ఎఫ్ సహా ఎలాంటి సంక్షేమ పథకాల చెక్కులైనా ప్రజాప్రతినిధులే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ గ్రామీణ సర్వేక్షణ్​లో భాగంగా రాష్ట్రంలోని సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు అవార్డులు వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీకి మనస్సు ఒప్పకపోయినా బీఆర్​ఎస్ సర్కార్ పనితీరుతో పురస్కారాలు ఇవ్వక తప్పడం లేదని తెలిపారు.

KTR Sircilla Tour Update: మంత్రి కేటీఆర్‌ రాజన్నసిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేటలో విద్యార్థులకు "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా ట్యాబ్‌లను అందజేశారు. విద్యార్థుల మధ్యకు వెళ్లి... వారితో కలిసి సందడి చేశారు. ప్రపంచంతో పోటీపడే పౌరుల్లాగా... విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే బీఆర్​ఎస్ సర్కార్‌ ప్రధాన లక్ష్యమని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు: ఆ తర్వాత సిరిసిల్లలో పలు గ్రామపంచాయతీ భవనాలు ప్రారంభించారు. అనంతరం సిరిసిల్లలో 400మంది లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకం అందని ఇల్లే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,052 మందికి రెండుపడక గదుల ఇళ్లు ఇచ్చామన్న కేటీఆర్.. ఇంకా 730 మందికి మాత్రమే ఇళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అర్హులందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో హనుమాన్​ గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదన్నారు.

'సిరిసిల్ల నియోజకర్గంలో ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారో లెక్కలు సేకరించాం. కాంగ్రెస్‌ హయాంలో 40 లక్షల మందికి ఇళ్లు ఇచ్చినట్లు లెక్కల్లో ఉంది. అయినా ఇల్లు లేని వారు 50 లక్షలకు పైగా ఉన్నట్లు తేలింది.ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని గ్రహించాం. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం అయితే ఫ్లాట్ ఇచ్చి ఆర్థిక సహాయం కూడా చేస్తాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

మోదీకి మనస్సు ఒప్పకపోయినా అవార్డులు ఇవ్వకతప్పడం లేదు : షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులొస్తే లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండని.. వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కేటీఆర్ అధికారులకు సూచించారు. రేయింబవళ్లు అధికారులు కృషి చేసి పథకాలు అందిస్తే పట్టించుకోరు.. కానీ ఒకరిద్దరికి రాకపోతే దాన్నే హైలెట్ చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ గ్రామీణ సర్వేక్షణ్​లో భాగంగా రాష్ట్రంలోని సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు అవార్డులు వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీకి మనస్సు ఒప్పకపోయినా బీఆర్​ఎస్ సర్కార్ పనితీరుతో పురస్కారాలు ఇవ్వకతప్పడం లేదని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మూడు అవార్డులు దక్కాయన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వృద్ధుల సంరక్షణ కేందాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేటలో 40 లక్షలతో 25 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. సంరక్షణ కేంద్రంలోని వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్న కేటీఆర్.. వారితో కాసేపు సరదా గడిపారు. ఆటలు ఆడుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

'రాష్ట్రంలో హనుమాన్​ గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు'

ఇవీ చదవండి:

Last Updated :Feb 28, 2023, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details