పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 615లో మెగా పార్క్, పల్లె ప్రకృతి వనం కోసం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి ఆదివారం ఉదయం.. జేసీబీ, ట్రాక్టర్లతో అధికారులు వెళ్లారు. ఆ భూమిలో తమకు పట్టాలున్నాయని.. ఏళ్ల తరబడి ఆ భూమిలో సాగుచేసుకుంటున్నామని రైతులు అన్నారు. తమకు కేటాయించిన భూములు లాక్కోవడం సరికాదంటూ.. ప్రకృతి వనం పనులను అడ్డుకున్నారు.
ఖమ్మంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 615లో గల భూమిలో గత 30 సంవత్సరాలుగా 17 ఎస్సీ కుటుంబాలు, 12 మంది బీసీ బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రకృతి వనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఆ భూమిలో ఇప్పటికే పంట సాగు చేస్తున్నామని, వారంతా అక్కడే ఉండి ప్రకృతి వనం పనులు నిలిపి వేశారు.
" మా తాతల నాటి నుంచి ఈ భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. ఈ భూమికి సంబంధించి మా వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. దీనిపై బ్యాంక్ క్రాప్లోన్ కూడా మంజూరు చేసింది. పల్లె ప్రకృతి వనం ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు కూడా వేశాం. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా అందాయి. అయినా.. అధికారులు కోర్టు ఉత్తర్వులు పట్టించుకోవడం లేదు. "