CM KCR Speech at Manthani Public Meeting : ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని.. ఓటేసే ముందు ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలని ఆకాంక్షించారు. అభ్యర్థులతో పాటు పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత పాల్గొని ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు : కేసీఆర్
ఈ సందర్భంగా గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ సరైన విధానాలు అవలంభించలేదని కేసీఆర్ ఆరోపించారు. పీవీ మెుదలుపెట్టిన రింగ్రోడ్డును.. పుట్ట మధు పూర్తి చేశారని తెలిపారు. రైతు బంధును పుట్టించిన పార్టీ భారత్ రాష్ట్ర సమితి అని.. రైతుబంధు ఇచ్చి డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని.. 3 గంటల కరెంట్ చాలంటున్న హస్తం పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుంది'
మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే రూ.1000 కోట్లతో మంథనిని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటానన్నారు. బీసీలకు వచ్చే అవకాశాలు తక్కువని.. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ధరణి వల్లే రైతు బంధు, రైతు బీమా నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్న సీఎం.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ దళారులు వస్తారని హెచ్చరించారు. అలా అంటున్న వారినే బంగాళాఖాతంలో కలపాలన్నారు.