తెలంగాణ

telangana

Paddy procurement in TS : ధాన్యం కొనుగోళ్లలో తప్పనితిప్పలు.. లారీలు లేక రైతులు విలవిల

By

Published : May 14, 2023, 7:11 AM IST

shortage of larry in procurement
shortage of larry in procurement ()

Paddy procurement in Telangana : ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కష్టాల కడలి సుడిగుండంలా ముంచెత్తుతోంది. అకాల వర్షాలతో మొన్నటిదాక అతలాకుతలమైన రైతన్నకు కొనుగోళ్లలో జాప్యం శాపమవుతోంది. లారీల కొరత ఇతరత్రా కారణాల రీత్యా.. కాంటా వేసిన ధాన్యం సైతం మిల్లులకి ఎప్పుడు చేరుతుందోనని పడిగాపులు తప్పట్లేదు. ఈలోపు మళ్లీ వర్షం వస్తే ఇక మిగిలేదేం ఉండదని ఆవేదన చెందుతున్నారు. లారీల కొరత త్వరగా తీర్చి కొనుగోళ్లు పూర్తి చేసేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న రైతులు

Paddy procurement in Telangana : నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం రైతులకు అవస్థలు ఎదురవుతూనే ఉన్నాయి. మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లతో పాటు ఐకేపీ సెంటర్లలోని సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తూకం వేసిన ధాన్యం తరలింపులోనూ ఆలస్యంతో అవస్థలు తప్పట్లేదు. వర్షం వస్తే బస్తాల్లో ధాన్యం మొలకెత్తుతుందనే భయం ఓ వైపు, ఆలస్యం అయ్యే కొద్దీ బస్తాల్లోని ధాన్యం బరువు తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.

Paddy procurement problems in Telangana : నిజామాబాద్‌ జిల్లాకు దాదాపు 850 వరకు లారీలు సమకూర్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ రైతులు రోడ్డుపై వెళ్తున్న లారీలను అడ్డగించి వాటి కింద పడుకొని నిరసన తెలిపటం లారీల కొరత తీవ్రతను తెలుపుతోంది. మిల్లులకు చేరిన వడ్లు ఎప్పటికప్పుడు దించుకుంటే సమస్య పెద్దగా ఉండదు. అయితే తడిసి ఆరిన వడ్లు కావటంతో మిల్లర్లు తరుగు అడుగుతున్నారు. సాధారణంగా కొనుగోలు కేంద్రంలో కాంటా వేసేటప్పుడే ఒకటి నుంచి రెండు కిలోలు తరుగు తీస్తున్నారు. బస్తాల్లో నింపి మిల్లుకు పంపిన తర్వాత సైతం మళ్లీ తరుగు తీస్తున్నారు. ఒప్పకోకపోతే ధాన్యం దించుకోకుండా రోజుల కొద్ది అలాగే ఉంచుతున్నారు. సొసైటీ సిబ్బంది మధ్యవర్తిత్వంతో కొంత తరుగు తీసుకుంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Purchases should be completed without loss to farmers : ధాన్యం బాగున్నప్పటికీ దొడ్డు రకాలపై మిల్లర్లు నిరాసక్తత కనబరుస్తున్నారు. సన్న రకాలతో కలిపి తెస్తేనే తూకం వేస్తున్నారు. దొడ్డు రకం లోడ్లు రెండింటికి ఒకటి సన్నరకం పంపితేనే మిల్లర్లు అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు ట్రక్‌షీట్లలోనూ రైతులకు కోత పెడుతున్నారు. లారీలు లేక, ఇతర సమస్యలతో ఆలస్యం జరిగినా ఆ నష్టం మాత్రం రైతులే భరించాల్సి వస్తోంది. ఇప్పటికైనా రైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొనుగోళ్ల ఆలస్యంతో వచ్చే సీజన్‌ పనులకు ఆటంకం కలుగుతుందని వెల్లడిస్తున్నారు.

"ధాన్యం చాలా రోజులుగా ఎక్కడికక్కడే నిల్వ ఉంటోంది. కాంట వేసినా.. లారీలు రావట్లేదు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నాలుగైదు రోజులు ఇలానే ఉండేసరికి తరుగు ఎక్కువైపోతుంది. కాంట అయిన వెంటనే లారీలో తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం." - స్థానిక రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details