తెలంగాణ

telangana

కాసేపట్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర

By

Published : Oct 23, 2022, 6:31 AM IST

Updated : Oct 23, 2022, 7:33 AM IST

Rahul Padayatra in Telangana

Rahul Padayatra in Telangana: భారత్‌ జోడో యాత్ర పాలమూరు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో పార్టీ బలంగా ఉన్న పాలమూరు నుంచి ప్రస్తుతం చట్టసభలకు ప్రాతినిధ్యమే లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పాదయాత్రతో శ్రేణుల్లో జోష్‌ వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. మరికాసేపట్లో యాత్ర నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం కృష్ణా మండలం గుండా తెలంగాణలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో మునిగిపోయారు.

Rahul Padayatra in Telangana: భారత్‌ జోడో యాత్ర పాలమూరు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఒకప్పుడు పాలమూరులో హస్తం పార్టీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస హవా సాగినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మాత్రం కాంగ్రెస్‌ అయిదు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు సీట్లను సాధించింది. 2018 ఎన్నికల్లో మాత్రం కొల్లాపూర్‌లో మాత్రమే గెలిచింది. ఆ ఎమ్మెల్యే తరవాత తెరాసలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ స్థానాన్నీ కాంగ్రెస్‌ కోల్పోయింది. రాహుల్‌ పర్యటన పార్టీకి జవసత్వాలు కల్పిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే ఎన్నికలకు మరో ఏడాదే సమయం.. : శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాహల్‌ పాదయాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సొంత ప్రాంతంలో ఈ యాత్ర ఉండటంతో భారీగా పార్టీ శ్రేణులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పాదయాత్రలో స్థానిక నేతలకు అవకాశం కల్పించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపనున్నారు. మక్తల్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో మాజీ ప్రజాప్రతినిధులు కొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ను వారితో మాట్లాడించేలా స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.

యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా: రాహుల్‌ పాదయాత్ర ప్రధానంగా యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా సాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని, పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చి భరోసాను కల్పిస్తారని పేర్కొంటున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులతో రాహుల్‌ భేటీ అయ్యేలా చూడాలన్న ఆలోచన కూడా నాయకుల్లో ఉంది. మహిళల సమస్యలనూ యాత్రలో ప్రస్తావిస్తారని నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఘన స్వాగతానికి ఏర్పాట్లు:భారత్‌ జోడో యాత్రకు ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మారుతినగర్‌ వద్ద ఉన్న వంతెన ద్వారా యాత్ర కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ, పీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి టైరోడ్డు వరకు కిలోమీటర్‌ మేర రాహుల్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు.

అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతారు. అనంతరం దిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ, 25వ, 26వ తేదీల్లో దీపావళి సందర్భంగా యాత్రకు విరామం ఇచ్చారు. ఈ నెల 27న తిరిగి మక్తల్‌ సమీపంలోని 33కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

నేతల సందర్శన:పాదయాత్ర నేపథ్యంలో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి శనివారం సాయంత్రం కృష్ణా వంతెన, టైరోడ్డు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు జిల్లాలోనే ఉండి యాత్ర విజయవంతంపై స్థానిక పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 413 మంది విధులు నిర్వహించనున్నారు.

మొదటి అంచెలో రాహుల్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారు. రెండో అంచెలో సీఆర్‌ఫీఎఫ్‌ బలగాలు, మూడో అంచెలో జిల్లా పోలీసులు ఉంటారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ మీదుగా రాయచూరు వెళ్లే వాహనాలను పాదయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. మరికల్‌ నుంచి అమరచింత, ధరూరు, కేటీదొడ్డి మీదుగా రాయచూరుకు వెళ్తాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఈ ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

అన్ని నియోజకవర్గాల ప్రతినిధులతో:ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రతినిధులతో రాహుల్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలు, పార్టీ పరిస్థితిపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలపైనా రాహుల్‌ ఏమైనా సందేశమిచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

ఇవీ చదవండి:హైదరాబాద్‌ నగర నడిబొడ్డు నుంచే భారత్​ జోడో యాత్ర.. రూట్​ మ్యాప్​ ఇదే..

తన స్వదస్తూరీతో ప్రధానికి పోస్టుకార్డు రాసిన మంత్రి కేటీఆర్‌.. ఎందుకో తెలుసా?

'లాటరీ, మద్యం ఆదాయ వనరులా?'.. కేరళ సర్కారుపై గవర్నర్​ ఆరిఫ్​ ఫైర్​

Last Updated :Oct 23, 2022, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details