తెలంగాణ

telangana

మహిళలు ఆర్థికంగా బలపడాలి: కలెక్టర్ హరిచందన

By

Published : Jan 27, 2021, 3:54 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉచిత కుట్టు మిషన్​ శిక్షణ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి హరిచందన ప్రారంభించారు. శిక్షణకు వచ్చిన వారు పట్టుదలతో నేర్చుకుని కొత్త కొత్త డిజైన్లను తయారు చేయాలన్నారు.

ఉచిత కుట్టు మిషన్​ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్​
ఉచిత కుట్టు మిషన్​ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్​

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించిన వారవుతారని నారాయణపేట జిల్లా కలెక్టర్ డి.హరిచందన అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మహిళలు సాధికారత సాధించడానికి చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్​ తెలిపారు.

ఇందులో భాగంగానే హైదరాబాద్​లోని రాంకీ ఫౌండేషన్ వారిని సంప్రదించి జిల్లాలో ఉచిత కుట్టు మిషన్​ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏ పని చేసినా నైపుణ్యంతో చేయగలిగితే అలాంటి ఉత్పత్తులకు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో, దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత శిక్షణకు వచ్చిన వారు పట్టుదలతో నేర్చుకుని కొత్త కొత్త డిజైన్లను తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి, రాంకీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాంరెడ్డి, శ్రావణి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరినారాయణ్​ భట్టాడ్, శిక్షణ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక

ABOUT THE AUTHOR

...view details