తెలంగాణ

telangana

మునుగోడులో గేరు మార్చిన కారు.. కేటీఆర్​ రోడ్​షోతో మరింత పెరిగిన కారు వేగం

By

Published : Oct 24, 2022, 9:35 AM IST

KTR in munugode bypoll campaign: మునుగోడు ఎన్నిక కార్పొరేట్‌ కమలానికి.. గరిబోళ్ల గులాబీకి మధ్య జరుగుతున్న పోరు అని మంత్రి కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు, నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఊరూవాడా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రోడ్‌షోలతో జోరుగా ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్​ నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు. గులాబీ పార్టీని గెలిపించాలంటూ హామీల వర్షం కురుపిస్తున్నారు.

TRS leaders
TRS leaders

మునుగోడులో గేరు మార్చిన కారు.. కేటీఆర్​ రోడ్​షోతో మరింత పెరిగిన కారు వేగం

KTR in munugode bypoll campaign: గులాబీ జెండాలు.. జై తెలంగాణ నినాదాలు.. డీజే పాటలు.. బోనాలతో స్వాగతాలు... ఇదంతా మునుగోడు నియోజకవర్గంలో తెరాస ప్రచార జోరు. ఉపఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలంటూ.. పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పల్లెపల్లెలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే.. తెరాస గెలవాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ రోడ్‌షోలు చేస్తూ.. గులాబీ శ్రేణుల్లో జోష్‌ను నింపుతున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్​ గట్టుప్పల్‌లో పర్యటించారు. నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న మంత్రి మునుగోడు అభివృద్ధి కోసం గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ పార్టీ మారారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో గెలిచిన రోజు నుంచే రాజగోపాల్‌ భాజపాతో సంప్రదింపులు జరిపారని అన్నారు.

మునుగోడు ఎన్నిక కార్పొరేట్‌ కమలానికి.. గరిబోళ్ల గులాబీకి మధ్య జరుగుతున్న పోరు అని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. పేదల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. దళితబంధు తరహాలో భవిష్యత్‌లో అన్నివర్గాల వారికి సర్కారు సాయం అందిస్తామని మంత్రి చెప్పారు.

కేటీఆర్​ రోడ్‌షోకు ముందు తెరాస అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి.. చండూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఉడుతాలపల్లి, పడమటితాళ్ల , కాస్తాల, శిర్దేపల్లి గ్రామాల్లోని ఓటర్లను కలుసుకున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఉపఎన్నికలో తెరాసను గెలిపించాలంటూ.. మంత్రి సత్యవతి రాఠోడ్‌ సంస్థాన్‌ నారాయణపురం మండలం పోర్లగడ్డలో ప్రచారం చేశారు.

స్థానికులను ఓట్లు అభ్యర్థించిన మంత్రి సత్యవతి ఓ ఇంట్లో జొన్నరొట్టెలు చేసి సందడి చేశారు. భారాసకు భయపడే భాజపా మునుగోడు ఉపఎన్నికకు కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇది భాజపా వేల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన ఉపఎన్నిక అని.. కేసీఆర్​ దృష్టి మరల్చే ప్రయత్నమని అన్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా మునుగోడులో తెరాస గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details