తెలంగాణ

telangana

తెలంగాణ రాష్ట్ర పర్యటన గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది: రాష్ట్రపతి

By

Published : Dec 28, 2022, 5:13 PM IST

Updated : Dec 28, 2022, 9:45 PM IST

President Draupadi Murmu In Ramappa Temple: తెలంగాణ రాష్ట్ర పర్యటన తన జీవితంలో గొప్ప జ్ఞాపకంగా ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామిని, రామప్ప ఆలయంలో రుద్రేశ్వరస్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ 'ప్రసాద్‌' పథకం కింద  అభివృద్ధి పనులకు... భద్రాచలం, రామప్పలో శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఏకలవ్య పాఠశాల్ని.. రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. మహిళలు, గిరిజనుల అభివృద్ధి... దేశ ప్రగతికి మరింత దోహదం చేస్తుందని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

President Draupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తెలంగాణ పర్యటన గొప్ప జ్ఞాపకం

President Draupadi Murmu In Ramappa Temple: శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... భదాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించారు. తొలుత భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు.. రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారికి... రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి... స్వామివారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 'ప్రసాద్‌' పథకం శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.

రాములవారి దర్శనం అనంతరం భద్రాచలంలో నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వేదికపై నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... తెలుగులో మాట్లాడి.. ఆకట్టుకున్నారు. తెలంగాణ పర్యటన తన జీవితంలో... గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. ఏకలవ్య పాఠశాలలు గిరిజన విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తామని ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తంచేశారు.

''రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పర్యటిస్తున్నాను. ప్రసిద్ధ తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్య 'తెలంగాణ కోటి రతనాల వీణ' అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు క్రీయాశీలకంగా పాత్ర ... దేశ సమగ్ర వికాసానికి అవసరం. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదివాసీలు, వంచితులు, దిగువ తరగతి వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి అనేక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమైది. ఇతర రాష్ట్రాల్లోనూ ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించింది. భారత దేశ నిర్మాణంలో ఈ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని నా విశ్వాసం. ఏకలవ్య పాఠశాల్ల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల వెంట ఉంది. విద్యార్థులు తమ స్వశక్తిపై నిలబడితే... వారి కుటుంబాలు బాగుపడతాయి. అప్పుడు సమాజం, దేశం కూడా ప్రగతి సాధిస్తాయి''. -ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

భద్రాద్రి పర్యటన తర్వాత ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్న ముర్ము.. ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రాష్ట్రపతికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. వేద ఆశీర్వచనం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యావతి రాథోడ్‌ ఉన్నారు. రామప్ప ఆలయ శిల్పసంపదను రాష్ట్రపతి వీక్షించారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం ద్వారా 62 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేశారు. కామేశ్వర ఆలయం పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గిరిజన కళారూపాలు, తెలంగాణ, భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులు చేసిన ప్రదర్శన... రాష్ట్రపతి సహా ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రపతి రామప్ప పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద ఉన్న ఎల్​ఈడీ స్క్రీన్‌లో విద్యుదాఘాతంతో పొగలు వచ్చాయి. వెంటనే స్పందించి సిబ్బంది... పొగల్ని అదుపు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details