తెలంగాణ

telangana

Ramappa Temple News : 'ప్రసాద్' పథకంలో చేరిన రామప్ప ఆలయం

By

Published : Feb 25, 2022, 8:34 AM IST

Ramappa Temple News : ప్రసిద్ధ రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత.. ఆలయ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ.. తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం(ప్రసాద్‌)లో చేర్చింది. దీనికి ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా.. ఆలయలో సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రూ.40-50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

Ramappa Temple
Ramappa Temple

Ramappa Temple News : కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీక, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్‌)లో చేర్చింది. ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి దీనికి ఆమోదం తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ పంపనున్నట్లు సమాచారం. ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు సంబంధించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పంపాలని కేంద్ర పర్యాటకశాఖ రాష్ట్రాన్ని కోరనుంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భద్రాచలం ఆలయాన్ని కూడా ప్రసాద్‌ పథకంలో చేర్చిన విషయం తెలిసిందే. రామాయణ సర్క్యూట్‌ కింద ఆ ఆలయాన్ని చేర్చారు.

Ramappa Temple in Prasad Scheme : ములుగు జిల్లాలోని రామప్ప (రుద్రేశ్వర) ఆలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. జులైలో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది. దీనివల్ల విదేశీ టూరిస్టులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం కేంద్ర పర్యాటకశాఖ రూ. 40-50 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆలయం లోపల పనుల్ని కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపట్టనుంది. వీటికోసం రూ.7 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.

ఏమేం కావాలి.. చేయాలి?

Prasad Scheme : సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్‌ సదుపాయం, పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పాలంపేట గ్రామం వరకు రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, టాయ్‌లెట్లు, బసకు హోటళ్లు, తాగునీరు, క్యూలైన్‌ వంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు మ్యూజియం, శిల్పారామం వంటి ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా రామప్ప ఆలయ ప్రాంగణంలో గతంలో పునర్నిర్మాణం కోసం విడదీసిన కామేశ్వర ఆలయాన్ని తిరిగి నిర్మించాల్సి ఉంది. యునెస్కో విధించిన షరతుల్లో ఇది కూడా ఉంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details