తెలంగాణ

telangana

'ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకం'

By

Published : May 19, 2022, 4:10 PM IST

Updated : May 19, 2022, 5:30 PM IST

Nallala Odelu
Nallala Odelu ()

Revanth Reddy On Nallala Odelu: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెరాసకు షాక్ తగిలింది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి హస్తం గూటికి చేరారు. దిల్లీలో ఇవాళ సోనియా గాంధీని కలిసిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

'ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకం'

Revanth Reddy On Nallala Odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరు పార్టీలో చేరిన అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రేవంత్​రెడ్డి ఉద్ఘాటించారు. నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరన్న రేవంత్... ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తోందని తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

ప్రియాంకాగాంధీతో కాంగ్రెస్ నేతలు

"తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం. ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకం. కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరు. ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తోంది. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు." -- రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్

అంతకుముందు.... సోనియా గాంధీతో కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేత దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు. సోనియా దగ్గరకు నల్లాల ఓదెలు దంపతులను రేవంత్​రెడ్డి తీసుకెళ్లారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2009, 2014 ఎన్నికల్లో తెరాస తరఫున నల్లాల ఓదెలు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్‌గానూ పనిచేశారు.

భాగ్యలక్ష్మికి కండువా కప్పుతున్న ప్రియాంక

ఓదెలు ప్రస్థానం: తెరాస ఆవిర్భావం నుంచి తెరాసలో కొనసాగారు నల్లాల ఓదెలు. పార్టీలో సాధారణ కార్యకర్తగా చేరిన నల్లాల ఓదెలు 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్​పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాజీనామా చేసి 2010లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యే గెలుపొందడంతో ప్రభుత్వ విప్​గా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 2018లో చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదెలుకు కాకుండా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన బాల్క సుమన్​కు ఎమ్మెల్యే పోటీచేసే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా సుమన్ గెలుపొందడంతో ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఈ క్రమంలోనే నల్లాల ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. సుమన్​తో విభేదాలు ఎక్కువ కావడం వల్ల పార్టీలో ఉండలేక కొన్ని రోజులుగా సన్నిహితులు కుటుంబ సభ్యులు అభిమానులతో చర్చలు జరిపి రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ.. నాపై అపనమ్మకంతో 2018లో టికెట్ నిరాకరించారు. ఆనాటి నుంచి ఇవాళ్టి వరకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశించాను. నా భార్యకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ, ప్రొటోకాల్ లేదు.. అధికారాలు లేవు. ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్ నా ఇంటిపై నిఘా పెట్టి, సెల్‌ఫోన్లలో బెదిరింపు మెసేజ్​లు పెడుతున్నాడు. పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. తెలంగాణ ద్రోహులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇవన్నీ సహించలేకనే నేను తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తాను.-- నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్యే

అందుకే తెరాసను వీడారా?:చెన్నూరు నియోజకవర్గ తెరాసలోని విభేదాలే ఓదెలు పార్టీ వీడటానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో అగాథం పెరగడం.. అతడితో విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడినట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా సన్నిహితులు, అభిమానులు, కుటుంబసభ్యులతో ఓదెలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలు తీసుకుని తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓదెలు తెరాసను వీడటం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:


Last Updated :May 19, 2022, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details