తెలంగాణ

telangana

సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 9:26 AM IST

Nagarjuna Sagar Project Water Supply in Khammam : నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో అన్నదాతల సాగు ఆశలు ఆవిరవుతున్నాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు కావడం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకపోవడంతో పంటలకు సాగు నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్​ఎస్పీ ఆయకట్టుకు ప్రధాన ఆధారమైన నాగార్జున సాగర్ జలాశయం నుంచి యాసంగిలో పంటలకు సాగునీరు అందే అవకాశం కన్పించకపోవడంతో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఫలితంగా ఈసారి సాగర్ ఆయకట్టులో క్రాప్ హాలీడే ప్రకటించాలని సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ ప్రతిపాదించడంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Nagarjuna Sagar Project Water Supply problems
Nagarjuna Sagar Project Water Supply in Khammam

యాసంగి సాగు ఆశలు ఆవిరి - 2.5 లక్షల ఎకరాల్లో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి

Nagarjuna Sagar Project Water Supply in Khammam: ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ఉంది. మొత్తం 2 లక్షల 54 వేల 274 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇందులో ఏటా ప్రధానంగా వరి పంట సాగవుతుంది. మొత్తం ఆయకట్టులో దాదాపు 80 శాతం ఆయకట్టు వరకు పూర్తిగా సాగర్ జలాలపైనే ఆధారపడి పంటలు సాగవుతాయి. మరో 20 శాతం మేర పంటలు బోర్లు, బావుల జలాలపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు.

ప్రతి సీజన్‌లోనూ ఎన్​ఎస్పీ ఆయకట్టులో పంటల సాగుకు కనీసం 27 నుంచి 31 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది. యాసంగిలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఇంకా కొంత అదనంగా అవసరమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో సాగర్ ఆయకట్టుకు నాగార్జున సాగర్జలాశయం నుంచే నీరు విడుదల చేయాల్సి ఉండగా, 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం, 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 522 అడుగుల మట్టంతోనూ 153.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు

Nagarjuna Sagar Project Water Supply problems : ఇందులో 110 అడుగుల డెడ్ స్టోరేజీ కాగా 43 అడుగులతో నిల్వ ఉన్న 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ వాటా మొత్తం 35 టీఎంసీలు ఉంది. ఈ వాటాలో ఇప్పటికే 10 టీఎంసీల నీటి వాడకం పూర్తయింది. మిగిలింది మరో 25 టీఎంసీలే. సాగర్, శ్రీశైలం ఇతర జలాశయాల కింద తాగునీటి పథకాలకు జూన్ వరకు నీరందించాలంటే దాదాపు 30-40 టీఎంసీల నీరు కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం 25 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండటంతో జూన్ వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్​ఎస్పీ ఆయకట్టులో సాగుకు చుక్క నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Face Problems : ఆయకట్టుకు సాగు నీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఈసారి ఎన్​ఎస్పీలో పంటల సాగు అగమ్యగోచరంగా తయారైంది. బోర్లు, బావుల కింద సాగయ్యే ఆయకట్టులో మాత్రమే పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. మిగిలిన దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని భూములన్నీ బీడుగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగర్ నుంచి సాగునీరందక, ఇటు వర్షాల ఊసులేక, ఎలా పంటలు సాగు చేసుకోవాలో అర్థం కాక ఆయకట్టు పరిధిలోని రైతులు మదన పడుతున్నారు.

Sagar Left Canal Farmers Problems: ఈ పరిస్థితుల్లో మరో అవకాశంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని తీసుకొని వస్తే కొంతమేర రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో సాగర్ ఆయకట్టుకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉపయోగపడుతున్న పాలేరు జలాశయానికి సరఫరా చేసి, అక్కడి నుంచి జిల్లా అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ఎన్​ఎస్పీ ఆయకట్టులో పంటల సాగు ఆశలు ఆధారపడి ఉన్నాయి.

సాగర్ వివాదంపై వీడని అనిశ్చితి - తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

ABOUT THE AUTHOR

...view details