BRS Public Meeting in Khammam: ఖమ్మంగడ్డపై 5 లక్షల మందితో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతున్న భారత్ రాష్ట్రసమితి ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లుచేస్తోంది. సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి హరీశ్రావు ఖమ్మంలో మకాంవేసి ఎప్పటికప్పుడు పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా,ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ లక్ష్యాలు.. భారీ జనసమీకరణ, సభకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3 లక్షల మందిని తరలించేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. సమీపంలోని జిల్లాల నుంచి.. జన సమీకరణ చేసేలా మార్గనిర్దేశం చేస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారగా.. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా నియోజకవర్గ నేతలతో మంత్రి హరీశ్రావు మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.
వైరాలో జరిగిన.. బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఆద్యంతం ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి హరీష్రావు ఆధ్వర్యంలో కలుపుగోలుగా మాట్లాడుకోవడం కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తించింది. బహిరంగ సభకు.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నందున బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ నాయకులు, శ్రేణుల్ని.. బీఆర్ఎస్ భాగస్వామ్యం చేస్తోంది. ఇందుకోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో సీపీఎం, సీపీఐ నేతలతో మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. 18న బహిరంగ సభలో పాల్గొనాలని హరీశ్ కోరగా.. వారు సమ్మతించారు.