తెలంగాణ

telangana

KTR On TS Elections 2023 : 'ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా BRS హ్యాట్రిక్​ ఖాయం'

By

Published : May 8, 2023, 8:09 PM IST

Minister KTR

KTR comments on Telangana Election 2023: పేద ప్రజల హితం కోసం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడం సమిష్టి అభిమతం కావాలని మంత్రి కేటీఆర్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కనీస సౌకర్యాల కల్పనను పట్టించుకోని ప్రతిపక్ష నేతలను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు.

KTR comments on Telangana Election 2023: పురపాలక మంత్రి కేటీఆర్​ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత సహచర మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి రూ.2 వేల కోట్ల ఓరియంట్‌ సిమెంట్‌ పరిశ్రమ విస్తరణ పనులకు కేటీఆర్​ బెల్లంపల్లిలో శ్రీకారం చుట్టారు. ఈ విస్తరణతో 4 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు.

త్వరలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 350 ఎకరాల్లో రూ.20 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో రోడ్ల నిర్మాణానికి, రూ.44 కోట్లతో మిషన్‌ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఏఎంసీ మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి బీజేపీ, కాంగ్రెస్‌ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏనాడు ప్రజల మేలు గురించి ఆలోచించని విపక్ష నేతలు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చిత్ర,విచిత్ర హామీలతో మభ్యపెట్టేందుకు వస్తున్నారని మండిపడ్డారు.

KTR on a visit to Karimnagar: అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన పోలీస్‌ కమిషనరేట్‌ భవనం ప్రారంభం సహా రూ. 300 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగసభలో విపక్షాలపై కేటీఆర్​ విరుచుకుపడ్డారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసింది శూన్యమని విమర్శించారు. ప్రజల బాధలు పట్టించుకోని నాయకులను నమ్మితే ప్రజలను నట్టేట ముంచడం ఖాయమన్నారు. పనిచేసే నిఖార్సయిన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందిరపైనా ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌పై అవాక్కులు చవాక్కులు ప్రదర్శిస్తున్న నాయకులకు ప్రజలు ఓటు రూపంలో మద్దతు తెలిపి గట్టి బుద్ధిచెప్పాలని జనాన్ని కోరారు.

"దేశ సరిహద్దులో సైన్యం కాపాడితే అంతర్గత శాంతి భద్రతలను స్థానిక పోలీసులు కాపాడుతున్నారు. ఒకప్పుడు బెంగాల్ దేశానికి మార్గదర్శనం చేస్తుందనే నానుడి ఉండేది. ఇప్పుడు తెలంగాణ దేశానికి నిర్దేశనం చేస్తోంది. దేశంలో ఉత్తమ పోలీస్ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఆధునిక టెక్నాలజీను వినియోగిస్తున్న పోలీసులంటే తెలంగాణ పోలీసులే.. పోలీసింగ్ అంటే కేవలం అడుగడుగునా కార్లు కెమెరాలు మాత్రమే కాదు.. ఎఫిక్టివ్ పోలీసింగ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం".-కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

KTR : 'ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో BRS​ గెలుపు ఖాయం'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details