కుమురం భీం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతామైన లింగాపూర్ మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన రహదారిని రామగుండం సీపీ సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీలు ఇన్నాళ్లూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టంగా ఉందంటూ ఇటీవలే పోలీసులను ఆశ్రయించారు.
ఆదివాసీల కష్టం గుర్తించారు.. ఆ గూడేనికి రోడ్డేశారు..
రామగుండం సీపీ సత్యనారాయణ.. కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలంలో పర్యటించారు. మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన రహదారిని ఆయన ఘనంగా ప్రారంభించారు. తమ ప్రాంతానికి విచ్చేసిన అధికారులకు.. ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు.
గిరిజనుల కష్టాలను అర్థం చేసుకున్న పోలీసులు.. స్థానిక ప్రజల సహకారంతో రహదారి నిర్మాణానికి నడుం బిగించారు. మండలంలో సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మావోయిస్టులకు ఎవరూ సహకరించకూడదని పోలీసులు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ సుధీంద్ర, ఏఎస్పీ అచ్చేశ్వర్ రావు, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..