తెలంగాణ

telangana

పరుగులో గెలిచి.. మృత్యువు చేతిలో ఓడిపోయాడు..

By

Published : Dec 25, 2022, 12:26 PM IST

Hyderabad

ఆ యువకుడు పోలీసు ఉద్యోగం కోసం ఎంతో శ్రమించాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. ఈవెంట్స్​ కోసం నిరంతర సాధన చేశాడు. శనివారం నిర్వహించిన పరుగు పందెంలోనూ విజయం సాధించాడు. అయితే ఆ ఆనందం అనుభవించకుండానే అనంతలోకాలకు చేరాడు.

నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యువకుడు పోలీసు కావాలని కలలు కన్నాడు. క్రీడల్లో, దేహదారుఢ్యంలో రాణిస్తూ.. ఎట్టకేలకు కానిస్టేబుల్‌ పరీక్షల్లో పాల్గొని ప్రిలిమినరీలో అర్హత సాధించాడు. పరుగు పందెంలోనూ విజయాన్ని సొంతం చేసుకున్న ఆనందం అనుభవించకుండానే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్‌ (29) హైదరాబాద్‌లోని అంబర్‌పేట సీపీఎల్‌ మైదానంలో శనివారం ఉదయం 1,600 మీటర్ల పరుగు పందేన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. పోలీసు అధికారులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం చనిపోయాడు. మహేశ్‌ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని అప్పగించారు.

పేద కుటుంబం.. జాతీయ క్రీడాకారుడు..:పేద కుటుంబానికి చెందిన మహేశ్‌ కబడ్డీ, క్రికెట్‌ క్రీడల్లో ప్రతిభ కనబర్చేవాడు. పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కబడ్డీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. శారీరకంగా దృఢంగా ఉండేవాడు. కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో శిక్షణ పొందాడు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటూ ఈవెంట్ల కోసం నిత్యం సాధన చేస్తున్నాడు. పోలీసు ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చదవండి:అరుదైన వ్యాధి.. అంతులేని వ్యథ: నలుగురు అన్నదమ్ముల దీనగాథ

వాజ్​పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి సహా ప్రముఖుల ఘన నివాళి

ABOUT THE AUTHOR

...view details