Low level bridge: జగిత్యాల జిల్లాలో వర్షం వచ్చిందంటే జనం అల్లాడిపోతున్నారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని గ్రామీణ మండలం అనంతారం జాతీయ రహదారి వద్ద, ధర్మపురి మండలం నేరేళ్ల వద్ద లో లెవెల్ వంతెనలు ఉండగా.. వర్షాలు కురిసినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారి కావడంతో ధర్మపురి-మంచిర్యాల రహదారి నుంచే ఎక్కువ శాతం మంది ప్రయాణం చేస్తుంటారు. ఏటా లో లెవెల్ వంతెనలు మునిగిపోతుంటాయి. ఈసారి కురిసిన భారీ వర్షాలకు సైతం వంతెనలు మునగడంతో రాకపోకలు సాగించలేక జనం ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని పెర్కపల్లి వద్ద తరచూ వంతెనలు మునిగిపోతుంటాయి. రాయికల్ మండలంలోని చల్గల్, సింగరావు పేట, మైతాపుర్, అల్లీపూర్తో పాటు మరికొన్ని లో లెవెల్ వంతెనలపై ఇదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల, మల్లాపూర్ తదితర మండలాల్లోనూ లో లెవెల్ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతున్నాయి.