తెలంగాణ

telangana

Solar vehicles: తండ్రి బాటలో నడుస్తూ.. సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ...

By

Published : Oct 11, 2021, 12:28 PM IST

తండ్రి బాటలో నడుస్తూ... తనదైన రీతిలో వాహనాలను తయారు చేస్తున్నారు ఓ యువకుడు. తండ్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వానికి, రైతులకు ఉపయోగపడే ప్రయోగం చేసి(Solar vehicles) విజయం సాధించారు. తాను చదివిన చదువుతో వినూత్న ప్రయోగం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన యువకుడు అల్లాడి ప్రణయ్​కుమార్​పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Solar vehicles, young man projects
సోలార్​తో నడిచే వాహనాలు, యువకుడి ప్రయోగాలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బీడీ కాలనీకి చెందిన అల్లాడి ప్రణయ్ కుమార్ సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ చదివిన ఈ యువకుడు... అందరికీ ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారు చేశారు. సోలార్ వాహనాన్ని తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్క్రాప్ కింద పడేసిన వాహనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి... దానికున్న ఇంజిన్ తదితర వస్తువులు తొలగించి బ్యాటరీలను అమర్చారు. అలా సోలార్ శక్తి​తో (Solar vehicles) వాహనం నడిచేలా తీర్చిదిద్దారు. ఈ వాహనాన్ని తయారు చేయడానికి సుమారు ఒక నెల సమయం పట్టిందని ప్రణయ్ తెలిపారు. ఈ సోలార్ వాహనాన్ని జగిత్యాల కలెక్టర్ రవి పరిశీలించి ప్రణయ్​ను ప్రశంసించారు.

ఇంధనం అవసరం లేదు..

ప్రణయ్ తయారు చేసిన ఈ వాహనానికి హైడ్రాలిక్ సిస్టమ్​ని కూడా ఏర్పాటు చేశారు. గంటకి 40 కిలోమీటర్ల వరకు వెళ్లే ఈ వాహనం... సుమారు 500ల కిలోల బరువును తీసుకెళ్తుందని ప్రణయ్ తెలిపారు. ఈ వాహనానికి రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల్లో నిత్యం చెత్త సేకరణ కోసం వినియోగించే ఇంధన వాహనాలకు బదులు సోలార్​తో(Solar vehicles) నడిచే ఈ వాహనాన్ని వినియోగిస్తే లక్షల రూపాయలు ఆదా చేసుకోవడానికి ఎంతో ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.

చాలా ఉపయోగం

ఈ వాహనాలు వినియోగిస్తే... పెరుగుతున్న ఇంధన చార్జీల మోత కూడా ఉండదని తెలిపారు. కేవలం సోలార్ ప్యానల్(Solar vehicles) ద్వారా సూర్యరశ్మిని గ్రహించి బ్యాటరీ ఛార్జింగ్ చేయడం ద్వారా ఈ వాహనం నడిచేలా రూపొందించినట్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్నదాతలకు కూడా ఎంతో మేలు చేస్తుందని... ఎరువులు, విత్తనాలు, కూలీలను తీసుకెళ్లడానికి ఈ వాహనాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని వాహనాలు తయారుచేస్తానని తెలిపారు.

మున్సిపల్, రైతులకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని నేను తయారు చేశాను. అది సోలార్​తో ఛార్జింగ్ ​అయ్యేలా రూప్​పై సోలార్ ప్యానెల్ అమర్చి... బ్యాటరీలు ఛార్జ్ అయ్యేలా తయారుచేశా. మున్సిపల్ సిబ్బందికి ఉపయోగపడేలాగా హైడ్రాలిక్ సిస్టం కూడా పెట్టాం. ఇది 500 కిలోల బరువును మోయగలదు. 30-40 స్పీడ్​ వరకు వెళ్తుంది. దీనికి రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుంది.

-అల్లాడి ప్రణయ్ కుమార్, వాహన తయారీదారుడు

తండ్రి బాటలో..

ప్రణాయ్ తండ్రి ప్రభాకర్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పరికరాలను తయారు చేశారు. తనదైన రీతిలో వాహనాలు రూపొందించి... ప్రశంసలు అందుకున్నారు. అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ప్రణయ్ కూడా తండ్రి బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేను గత 40 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తూ... ఒక సంస్థను నెలకొల్పాను. ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇవన్నీ సొసైటీకి ఉపయోగపడేవే. మా బాబు కూడా చదువు పూర్తయ్యాక నాకు సపోర్టుగా ఉంటున్నాడు. రైతులు, మున్సిపల్ సిబ్బందికి ఉపయోగపడేలా సూర్యరశ్మితో పని చేసే వాహనాలు తయారుచేశాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని వాహనాలు తయారుచేస్తాం.

-అల్లాడి ప్రభాకర్, యువకుని తండ్రి

ఇదీ చదవండి: Drug addiction :మీ పిల్లలకు డ్రగ్స్ అలవాటుందా.. తెలుసుకోవాలంటే ఏంచేయాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details