Railway Minister on Telangana: 2009 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే కేటాయింపుల్లో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.3,048 కోట్లు తెలంగాణకు కేటాయించిందని రైల్వేశాఖ మంత్రి తెలిపారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే డబ్లింగ్, త్రిబ్లింగ్కు అదనంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే ఉందని విమర్శించారు. కాజీపేటలో పీరియాడిక్ ఓవరాలింగ్ (POH) వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.