ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ఆలయాలు శోభాయామానంగా తయారయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు వేకువ జామునుంచే భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో స్వర్ణలంకృతలుగా దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
యాదాద్రిలో ఘనంగా వేడుకలు
యాదాద్రి పాతగుట్టలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు. యాదాద్రిలో ఉదయం 6:43 నుంచి ఉదయం 9:30 గంటల వరకు... పాతగుట్టలో ఉదయం 10 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. బాలాలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు ద్వారం గుండా స్వామివారు దర్శనమిస్తున్నారు. నరసింహ నామస్మరణతో ఆలయ వీధులు మార్మోగుతున్నాయి.
రాజన్నకు ప్రత్యేక పూజలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే రాజన్నకి మంగళ వాయిద్యాలు, సుప్రభాతం, పల్లకి సేవ తదితర పూజలు నిర్వహించారు. స్వామివారిని అంబారి సేవపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను అర్చకులు వివరించారు.
ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం ముందట లక్ష్మీనరసింహస్వామికి పుష్ప వేదికపై వేద ఘోష నిర్వహించారు. ఉత్తరద్వారం గుండా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 3 గంటలకు స్వామివారికి అభిషేకాలు, ఆరే పత్రాలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
కాళేశ్వరంలో వైకుంఠ ఏకాదశి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయంలో తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు చేసి, 4.45 గంటలకు ఆలయ అర్చకులు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. శ్రీ సీతారమ చంద్ర స్వామి వారికి పంచహరతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహదేవపూర్లోని మందరగిరి స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు చేశారు. ఉదయం 4గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు.