Vacancies in Telangana Education Department : రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. ప్రత్యక్ష నియామకాల ద్వారా దాదాపు 12 వేల ఖాళీలను నింపాల్సి ఉంది. పదోన్నతులతో మరో 10 వేల పోస్టులు భర్తీ చేయాలి. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు 8 నెలలైనా మోక్షం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందక పేద విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నియామక ప్రకటనలు ఎప్పుడొస్తాయోనని లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
ఆర్థికశాఖ అనుమతించినా:ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 2,440 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ జులై 22న అనుమతి ఇచ్చింది. ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. ‘ఎస్టీ రిజర్వేషన్ను అమలుచేస్తూ జీఓ ఇవ్వడం వల్ల రోస్టర్ పాయింట్ల విధానం మారుతుంది. అది కొలిక్కి రావాలి’ అని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.
- పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో దాదాపు 9 వేల ఖాళీలను నింపాల్సి ఉంది. గతంలో ఉన్న 12 వేల మంది విద్యావాలంటీర్లను తొలగించడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. చివరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు (సీఆర్పీ) కూడా బోధించాలని ఇటీవలే ఆదేశించడం గమనార్హం. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు వచ్చి 5 నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఎన్ని ఖాళీలు భర్తీచేయాలో నిర్ణయిస్తూ ఆర్థికశాఖ నుంచి జీఓ రాలేదు. ఇక పదోన్నతులు ఇస్తే మరో 10 వేల మందికి ప్రయోజనం దక్కుతుంది. అంటే ఆ మేరకు పోస్టులు భర్తీ అవుతాయి. టెట్ పూర్తయిన వెంటనే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) జరుపుతామని పలుమార్లు ప్రకటించినా నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో 2013 తర్వాత నియామకాలు జరగలేదు. వాటిలో 707 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, మరో 300కి పైగా పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది.