తెలంగాణ

telangana

టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్.. 'AM 2 PM’ స్పీడ్ పార్శిల్ సేవలకు శ్రీకారం

By

Published : Jan 28, 2023, 6:41 AM IST

Updated : Jan 28, 2023, 6:56 AM IST

TSRTC launched express parcel service: ఆర్టీసీ వినియోగదారులకు ఓ శుభవార్త. మరింత వేగవంతమైన పార్శిల్‌ సేవలకు..టీఎస్​ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కార్గో వ్యాపార సేవలు అద్భుతంగా అందిస్తున్న సంస్థ.. తాజాగా "ఏఎం 2 పీఎం" సేవలు అందుబాటులోకి తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌ లాంఛనంగా ప్రారంభించారు. ట్రాఫిక్, లాజిస్టిక్స్‌ సేవల్లో భాగంగా ఒక కిలో బరువు గల పార్శిల్‌ ఎక్కడ్నుంచి ఎక్కడికైనా పంపించుకోవచ్చని ఆయన తెలిపారు.

TSRTC launced a new express parcel service
"ఏఎం 2 పీఎం" సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన టీఎస్​ఆర్టీసీ

AM 2 PM స్పీడ్ పార్శిల్ సేవలకు శ్రీకారం

TSRTC launched express parcel service: రాష్ట్రంలో వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు "ఏఎం 2 పీఎం" పేరిట నూతనంగా ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో ఈ సేవలను టీఎస్​ఆర్టీసీ సీఎండీ వీసీ సజ్జనార్‌ లాంఛనంగా ప్రారంభించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి "ఏఎం 2 పీఎం" పేరిట సర్వీస్ బ్రోచర్‌ ఆవిష్కరించారు.

TSRTC AM to PM parcel service : ప్రయాణికుల టికెట్‌ ఆదాయంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఆదాయాల మార్గాలపై సంస్థ దృష్టి పెట్టిన తరుణంలో పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ, లాజిస్టిక్‌తోపాటు స్వచ్ఛమైన జీవా వాటర్‌ బాటిళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022 జూన్‌లో శ్రీకారం చుట్టిన కార్గో సేవలు ద్వారా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆ సేవలు వినియోగదారులకు మరింత వేగంగా సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో.. ‘AM 2 PM’ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిన్నటి నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సాధారణంగా "ఏఎం 2 పీఎం" ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే... అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్‌ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ పార్శిల్ వెళ్తుంది. ఆ ప్యాకెట్ లేదా పార్శిల్ విలువ 5 వేల రూపాయలకు మించకూడదు. నగదు, యూపీఐ పేమెంట్స్‌ రూపంలో.. సేవలు పొందవవచ్చని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్గో సేవలు సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏజెంట్ల నెట్‌వర్క్‌ విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లను సంప్రదించి టైర్‌-3 నగరాలకు నాణ్యమైన కార్గో సేవలను విస్తరించేందకు కార్యాచరణ రూపొందిస్తోంది.

ఆయా ఈ-కామర్స్ కంపెనీల యాజమాన్యాలతో ఆర్టీసీ విస్తృతంగా సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, టీఎస్ ఫుడ్స్‌, టీఎస్ ఆయిల్‌ఫెడ్‌, టీఎస్ అకాడెమీ లాంటి సంస్థలు సహా.. అనేక ప్రభుత్వ విభాగాలు లాజిస్టిక్స్‌ సేవలు వినియోగించుకుంటున్నాయి. మిగతా ప్రభుత్వ సంస్థలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో 99 ప్రాంతాల్లో "ఏఎం 2 పీఎం" ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం 9154680020 ఫోన్‌ నంబర్‌ లేదా టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 28, 2023, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details