తెలంగాణ

telangana

niranjan reddy review on crop: 'యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలి'

By

Published : Dec 7, 2021, 6:10 PM IST

niranjan reddy review

niranjan reddy review on crop: యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలని... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పప్పు, నూనె గింజలు అధికంగా సాగు చేయాలని సూచించారు. యాసంగి పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్, ఉద్యానశాఖ, గిడ్డంగుల సంస్థ పురోగతిపైనా చర్చించారు. పంటలకు మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలన్నారు.

niranjan reddy review on crop : పంటలకు మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. గతంలో మాదిరిగా రాష్ట్ర వ్యవసాయ చట్టం నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్ఠం చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ మార్కెటింగ్ కార్యాలయంలో మార్కెటింగ్ ఉద్యాన శాఖ, వేర్‌ హౌసింగ్, మార్క్‌ఫెడ్‌, హాకా సంస్థలపై మంత్రి సమీక్షించారు.

పప్పు, నూనెగింజలు అధికంగా సాగుచేయాలి

యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పప్పు, నూనెగింజలు అధికంగా సాగుచేయాలని... మార్కెట్ రీసెర్చ్‌ అనాలసిస్​ విభాగం సూచించిందని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్లలో వసతులు సమకూర్చి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. కోహెడలో అంతర్జాతీయస్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. డీపీఆర్ రాగానే సీఎం ఆమోదం తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎరువుల సన్నద్ధతపై ఆరా

ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని... ఇందుకోసం వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికల్లో రైతులకు సమగ్ర సమాచారం ఉంచామని మంత్రి వెల్లడించారు. వరంగల్‌, ఖమ్మంలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యాసంగి సాగుకు ఎరువుల సన్నద్ధతపై సమీక్షించిన మంత్రి... క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలపై ప్రతి రోజు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వివరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హాకా పటిష్ఠతకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.

శ్రీగంధం సాగును ప్రోత్సహించాలి

ప్రభుత్వ గురుకులాలు పాఠశాలలకు నిత్యావసర వస్తువులు సరఫరా దిశగా హాకా ఆలోచించాలని సూచించారు. ఆ దిశగా వెంటనే దృష్టి సారించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏడాదికి 20వేల మెట్రిక్ టన్నుల శ్రీగంధానికి డిమాండ్‌ ఉందని... వీటి సాగు వైపునకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. శ్రీ గంధం అమ్ముకునేందుకు అటవీ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. వేర్​హౌసింగ్ గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:TRS MPs boycott Parliament: 'పార్లమెంట్‌ సమావేశాలు బాయ్‌కాట్ చేస్తున్నాం.. రాజీనామా అంశాన్ని ఆలోచిస్తాం'

ABOUT THE AUTHOR

...view details