రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులు అర్ధంతరంగా చదువు మానేయడం ఆందోళన కలిగిస్తోంది. పదో తరగతి పూర్తయ్యేలోపే ఏకంగా 57 శాతం మంది మధ్యలోనే బడికి దూరమవుతున్నారు. అయిదో తరగతి పూర్తిలోపే వందకు 28 మంది పుస్తకాలను వదిలేస్తున్నారు. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్) 2019-20 గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ సోమవారం యూడైస్ గణాంకాలను మీడియాకు విడుదల చేసింది.
2010-11లో ఒకటో తరగతిలో 1,27,859 మంది చేరగా...2019-20లో పదో తరగతిలోకి వచ్చే సరికి ఆ సంఖ్య 55,039కి పడిపోయింది. అంటే ఏకంగా 56.95 శాతం మంది తగ్గిపోయారు. డ్రాపౌట్ శాతం ఎస్సీల్లో 32.61 శాతం ఉండగా...అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుంటే 31.14 శాతం ఉన్నట్లు తేలింది. 2015-16లో ఒకటో తరగతిలో 94,247 మంది ఎస్టీ విద్యార్థులు చేరగా 2019-20లో అయిదో తరగతిలోకి వచ్చే సరికి వారి సంఖ్య 67,538కి తగ్గిపోయింది. అంటే 28.34 శాతం మంది బడికి దూరమయ్యారు. అదే ఎస్సీ విద్యార్థుల్లో 14.61 శాతంగా ఉంది.