తెలంగాణ

telangana

రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: పవన్

By

Published : Jan 25, 2023, 6:26 PM IST

Pawan at Vijayawada kanakadurga Temple: ఏపీలో రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ పేర్కొన్నారు. తన రాజకీయ యాత్రల కోసం సిద్ధం చేసిన వారాహి వాహనానికి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు.

Special Puja to Varahi Vehicle
Special Puja to Varahi Vehicle

రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: పవన్

Pawan at Vijayawada kanakadurga Temple : రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్​ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు, పండ్లను సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో దర్భముళ్ల భ్రమరాంబ, ఆలయ అధికారులు, పండితులు ఆయనతు స్వాగతం పలికారు.

అంతరాలయం నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పూజల అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పవన్‌ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత కొండదిగువన విజయ గణపతి ఆలయం వద్ద వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.

"నిన్న కొండగట్టులో వారాహికి పూజలు చేశాం. దుర్గమ్మ ఆశీస్సులు కూడా వారాహికి ఉండాలనే ఉద్దేశంతో నేడు విజయవాడకు వచ్చాం. నేటి నుంచి రాక్షస పాలన అంతం కావాలి. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలి. రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యం"-పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

వాహనం వద్ద గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని అభిలాషించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి నరసింహస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సమయంలో ఆలయ అధికారులు, పండితులు మంచి దర్శనం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మంగళ వాయిద్యాలతో స్వాగతించినందుకు అభినందనలు తెలియజేస్తూ.. వారి మంగళవాయిద్యాలే తమకు బలమన్నారు. వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అన్న పవన్​.. ఈ ప్రచార రథం విజయ తీరాల వైపు ప్రయాణించనుందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వారాహి వాహనంపై పవన్‌ కల్యాణ్‌ పయనమైన సమయంలో మోడల్‌ అతిథి గృహం ఎదురుగా గజమాలతో పవన్‌ కల్యాణ్‌కు, వారాహి వాహనానికి జన సైనికులు స్వాగతం పలికారు. పవన్​ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పోతిన మహేష్‌ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details