పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ అధికారులు విచారణను వేగంవంతం చేశారు. ఇందులో భాగంగా చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులు జహీద్, సమీ ఉద్దీన్, మాజ్ హుస్సేన్, ఖలీల్లను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆనంతరం వారిని చంచల్గూడ నుంచి మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.
పాపులర్ ప్రంట్ అఫ్ ఇండియా కేసులో ఇప్పటికే ఒక ఛార్జిషీట్ దాఖలు చేసిన దాఖలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.. మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంతకు ముందు 11 మందిపై ఎన్ఐఏ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం మరో ఐదుగురు నిందితులపై ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. అందులో పలు కీలక విషయాలను పేర్కొంది. భారత్లో ముస్లిం యువతకు శిక్షణ ఇచ్చి వారిని 2047 వరకు ఇస్లాం దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.
ప్రజల మధ్య మతకలహాలకై:ప్రజల మధ్య మత కలహాలను సృష్టిస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం జులై 4న వీరిపై కేసు నమోదైంది. అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరే కాక మరికొందరిని కూడా పోలీసులు నిందితులుగా పట్టుకున్నారు. మరో కేసు నమోదు చేసి గత సంవత్సరం ఆగస్టు 26న ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఏపీలో ఎన్ఐఏ సోదాలు చేసింది. అరెస్టు చేసిన నలుగురి ఇళ్లతో పాటు మరికొందరి అనుమానితుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణలో 34 ప్రాంతాల్లో, ఏపీలో 2 చోట్ల వీరు దర్యాప్తు చేశారు.