తెలంగాణ

telangana

Niranjan Reddy saval: 'సాయంత్రంలోగా యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి'

By

Published : Oct 28, 2021, 12:08 PM IST

Updated : Oct 28, 2021, 12:51 PM IST

వరి-ఉరి ప్రభుత్వ వైఖరితో బండి సంజయ్ చేస్తున్న దీక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిగింజా కొనేవరకు భాజపా నేతలు దీక్ష చేయండంటూ సవాల్​ విసిరారు.

Niranjan Reddy
మంత్రి నిరంజన్ రెడ్డి

నాలుగైదు మాసాలుగా వరి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతుంటే... ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వలేదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్రం వరి కొనుగోలు చేయకపోతే... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి... ఇప్పటివరకు వరి కొనుగోళ్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు.

లేఖ తీసుకొస్తే నేనే రాజీనామా చేస్తా

''వరి కొనుగోళ్లపై ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఏడేళ్ల కాలంలో వ్యవసాయన్ని అద్భుతంగా మలిచాం. రైతుబంధును అమలు చేశాం. రైతుకు మేలు చేసేలా కేంద్రం ఒక్క పథకాన్ని అయినా అమలు చేసిందా? కేంద్రం కొంటామంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నట్లు ఇక్కడ భాజపా నేతలు దీక్షలు చేస్తున్నారు. నాలుగేళ్లకు సరిపడా నిల్వలున్నాయి.. ధాన్యం కొనలేమని కేంద్రం లేఖ పంపింది. భాజపా నేతలు దేనికోసం దీక్ష చేస్తున్నారో చెప్పాలి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసం ఇంత గందరగోళం చేస్తారా? అయితే మీకో సవాల్​ విసురుతున్నాను. దీక్షలు చేయండి బండి సంజయ్. కేంద్రం ప్రతిగింజా కొనేవరకు భాజపా నేతలు దీక్ష చేయండి. రాష్ట్రంలో యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి. సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రం నుంచి లేఖ తీసుకురండి. రాష్ట్రంలో 63 లక్షల ఎకరాల్లో వరిసాగు అయింది. తెలంగాణలోని 60 లక్షల రైతుల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోంది. మీకు చిత్త శుద్ధి ఉంటే సాయంత్రం 5 లోగా లేఖ తీసుకురండి. లేదంటే మీ పదవులకు రాజీనామా చేయండి. ఒకవేళ మేము చెప్పింది తప్పని రుజువు చేస్తే వ్యవసాయ మంత్రిగా రాజీనామా చేస్తాను.''

-మంత్రి నిరంజన్​ రెడ్డి

భాజపాది మొత్తం వ్యాపార ధోరణి అని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు స్థితి, మనసును భాజపా అర్థం చేసుకోలేకపోతోందన్నారు. రాష్ట్ర రైతులకు మేలు చేయాలని భాజపాకు కొంచెం కూడా లేదని వెల్లడించారు. రాజకీయ నాటకాలు కట్టిపెట్టి రైతుల శ్రేయస్సు కోసం చూడాలని కోరారు. వానాకాలం పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని... రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఏం చేసినా.. ఎన్ని దీక్షలు చేసినా హుజూరాబాద్‌లో ప్రజలు భాజపాను తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.

సాయంత్రంలోగా యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి: నిరంజన్ రెడ్డి

ఇదీ చూడండి:LIVE: 'వరి-ఉరి ప్రభుత్వ వైఖరి' పేరుతో బండి సంజయ్​ రైతు దీక్ష

Huzurabad By election: సవాళ్లు చేసుకున్నారు... మరి ఎవరూ స్వీకరించలేదేం!

Bandi Sanjay press meet: 'వరి కావాలా.? ఉరి కావాలా.?.. కేంద్రంతో మరింత ధాన్యం కొనిపిస్తాం'

Last Updated :Oct 28, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details