తెలంగాణ

telangana

కేంద్రం పెంచుతున్న డీజిల్‌ ధరలతో ఆర్టీసీపై తీవ్రప్రభావం: పువ్వాడ

By

Published : Jan 9, 2023, 4:52 PM IST

Updated : Jan 9, 2023, 5:10 PM IST

TSRTC Ziva Mineral Water Bottles Launch:కేంద్రం పెంచిన డీజిల్‌ ధరలతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని... మొక్కవోని దీక్షతో రాష్ట్ర సర్కార్‌ సంస్థను కాపాడుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. ఆర్టీసీ సొంత బ్రాండ్ 'జీవ' మినరల్ వాటర్ బాటిళ్లను ఎంజీబీఎస్ బస్టాండ్​లో సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

Puvvada
Puvvada

TSRTC Ziva Mineral Water Bottles Launch: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఆ దిశగా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. తాజాగా మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆర్టీసీ సొంత బ్రాండ్‌ ‘జీవ’ పేరుతో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను ప్రయాణికులకు అందించనుంది.

ఈ మేరకు ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో సోమవారం జీవ వాటర్‌ బాటిళ్లను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. మొదట లీటర్‌ వాటర్‌ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 ఎంఎల్‌ బాటిళ్లను, ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం అర లీటర్‌ బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నారు.

'ఆర్టీసీ ఏడాదికి 90లక్షల వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తోంది. సుమారు కోటిన్నర రూపాయలు వాటర్ బాటిళ్లకోసం ఖర్చు చేస్తుంది. బయట కూడా వాటర్ బాటిళ్లు విక్రయించాలనే నిర్ణయించింది. ఆర్టీసీ ఇతర ఆదాయ మార్గాలు పెంచుకుంటోంది. కార్గో, పెట్రోల్ బంకులతో ఇప్పటికే ఆర్టీసీకి ఆదాయం. ప్రస్తుతం మినరల్ వాటర్‌ అమ్మకాలతో ఆదాయం. ఆర్టీసీ టికెటేతర ఆదాయం సమకూర్చుకోవటంపై దృష్టి సారించింది.'-పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి

కేంద్రం పెంచిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రం లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మాలని చూస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాలని చూస్తుందన్నారు. కార్గో, పెట్రోల్ బంకులతో.. ఇప్పుడు జీవ మినరల్ వాటర్​తో టికెటేతర ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తుందన్నారు. సంచలనాల కోసం కొందరు బీజేపీ నేతలు ఆర్టీసీపై అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. కానీ.. ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను సామాజిక బాధ్యతగా చూస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఆర్టీసీని సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణ చేయకూడదని నిర్ణయించారని స్పష్టం చేశారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఈనెల 18వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారన్న అంశంపై మాత్రం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించలేదు. ఖమ్మం జిల్లాలో తమ పార్టీ సుస్థిరంగా ఉంది అని పేర్కొన్నారు.

కేంద్రం పెంచుతున్న డీజిల్‌ ధరలతో ఆర్టీసీపై తీవ్రప్రభావం: పువ్వాడ

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details