Clash Between TRS and Congress Leaders in Gabbilalpet: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. సికింద్రాబాద్లోని గబ్బిలాల్పేట ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్ నగర్లో జీవో నెంబర్ 58, 59 అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని వారు దుయ్యబట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో గబ్బిలాల్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.