Janasena on Jagan: తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తాజాగా అవనిగడ్డ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. దీంతో ‘మాట తప్పితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లే గతి.. నాకైనా ఇదే వర్తిస్తుంది’’ అంటూ జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా చేసిన వ్యాఖ్యల్ని జనసేన కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెబితే, మోసాలు చేస్తే... చెప్పులు, చీపుర్లు చూపిస్తామంటూ ఏ రోజైతే ప్రజలు గట్టిగా నిలదీస్తారో అప్పుడే ఈ వ్యవస్థ మారుతుందని 2016 జూన్ 14న విజయవాడలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రాజకీయ నాయకులు తమను మోసగిస్తే చెప్పులు, చీపుర్లు చూపిస్తామనే స్థాయికి ప్రజలు రావాలి. ఇది రాజకీయ నాయకులందరికీ వర్తించాలి. అబద్ధాలు ఆడితే ఎవరికైనా సరే చెప్పులు, చీపుర్లు చూపించండి. ఈ సవాల్ ఎందుకు చేస్తున్నానంటే రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.
సీఎంకు సరిగా వినిపించడం లేదేమో:‘మూడు పెళ్ళిళ్లు చేసుకుంటే మంచిదని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని జనసేన నేతలు తెలిపారు. అలా ఆయన మాట్లాడారని ముఖ్యమంత్రి జగన్ అవనిగడ్డ సభలో చెప్పారని.. సీఎంకు వినికిడి శక్తి లోపించిందో ఏమో.. మంచి ఈఎన్టీ వైద్యుడికి చూపించాలని సూచించారు.