తెలంగాణ

telangana

సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు

By

Published : Jan 10, 2023, 7:25 PM IST

CS Someshkumar
CS Someshkumar ()

Highcourt on CS Someshkumar Allotment: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. సోమేష్ కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను క్యాట్ కొట్టివేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. తెలంగాణ క్యాడర్‌గా పరిగణించాలన్న ట్రైబ్యునల్ ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది. సోమేశ్ కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం, క్యాట్‌, హైకోర్టులో పరస్పర భిన్నంగా వాదించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అప్పీలు వెళ్లేందుకు వీలుగా తీర్పుపై మూడు వారాలు స్టే ఇవ్వాలన్న సోమేష్ కుమార్ అభ్యర్థననూ తోసిపుచ్చింది.

Highcourt on CS Someshkumar Allotment: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును ధర్మాసనం రద్దు చేసింది. ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను క్యాట్ కొట్టివేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సోమేశ్ కుమార్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేసి.. విభజన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. తనను తెలంగాణకు కేటాయించాలని సోమేశ్ కుమార్ కోరినప్పటికీ.. 2015లో సవరించిన ఉత్తర్వుల్లోనూ ఏపీకే కేటాయించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమేష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. వాదనలన్నీ విన్న క్యాట్.. సోమేష్‌కుమార్‌ను ఏపీ కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి.. తెలంగాణ క్యాడర్‌గా పరిగణించాలని 2016లో తీర్పు వెల్లడించింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లో కొనసాగిన సోమేష్ కుమార్... మూడేళ్లుగా సీఎస్‌గా ఉన్నారు.

సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ క్యాడర్‌గా పరిగణించాలన్న క్యాట్ తీర్పును సవాల్‌ చేస్తూ డీఓపీటీ 2017లో హైకోర్టును ఆశ్రయించింది. సోమేశ్‌కుమార్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సోమేశ్ తరఫున మాజీ ఏజీ డీవీ సీతారామమూర్తి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్‌ ప్రసాద్ వాదించారు. ఉత్తర్‌ప్రదేశ్ విభజన సమయంలో అగర్వాల్ కమిటీ సూచనలకు.. ఏపీ క్యాడర్ విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భిన్నంగా వ్యవహరించిందని సోమేష్ కుమార్ వాదించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉన్న అప్పటి సీఎస్ పీకే మొహంతి ఐఏఎస్ అధికారులైన తన కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని వాదించారు. కేడర్ విభజించేటప్పుడు పీకే మొహంతి పేరును జాబితాలో చేర్చలేదని మరో వాదనలు వినిపించారు.

కేంద్ర సర్వీసుల అధికారుల కేటాయింపుపై పూర్తి అధికారం డీఓపీటీదేనని అదనపు సొలిసిటరల్ వివరించారు. కేంద్రం వైఖరే తమ వైఖరని క్యాట్‌లో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టులో మాత్రం భిన్నంగా వాదించింది. ప్రస్తుతం సీఎస్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నందున.. సోమేశ్‌కుమార్‌ను తెలంగాణలో కొనసాగించాలని.. క్యాట్‌ తీర్పును సమర్థిస్తూ కేంద్ర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. సుదీర్ఘ వాదనలు విని కొన్నినెలల క్రితం తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఉత్తర్వులు వెల్లడించింది. క్యాట్ తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. క్యాట్ పరిగణనలోకి తీసుకున్న సోమేష్ కుమార్ వాదనలను తోసిపుచ్చింది.

అగర్వాల్ కమిటీ.. ప్రత్యూష్ సిన్హా సలహా కమిటీలు రెండూ వేర్వేరవని తెలిపింది. పీకే మొహంతి 2014 ఫిబ్రవరిలో స్వచ్ఛంద విరమణ చేసినందున ఆయన పేరును విభజనకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్యాట్ తీర్పు చట్టబద్ధంగా లేదని కొట్టివేసింది. అప్పీలు వెళ్లేందుకు వీలుగా మూడు వారాల గడువు ఇవ్వాలని సీజే ధర్మాసనాన్ని సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది కోరారు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details