తెలంగాణ

telangana

అంకబాబుపై తదపురి చర్యలు చేపట్టొద్దు.. సీఐడీకి హైకోర్టు ఆదేశం

By

Published : Oct 21, 2022, 3:44 PM IST

HIGH COURT ON ANKABABU: సీనియర్‌ జర్నలిస్టు అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అంకబాబు హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ దాఖలు చేశారు.

journalist ankababu
journalist ankababu

HC ON ANKABABU PETITION : సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని హైకోర్టులో అంకబాబు క్వాష్​ పిటిషన్​ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం సీఐడీ కేసులో ఆయనపై తదుపరి చర్యలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేసింది. గన్నవరం ఎయిర్‌పోర్టులో బంగారం కేసుకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని అంకబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ జరిగింది:Journalist Ankababu in CID custody: సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్‌ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబును సెప్టెంబర్​ 22న సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.

అంకబాబు సతీమణి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించిగా.. తాము సీఐడీ అధికారులమని, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు అంకబాబు వాట్సప్‌లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని, వాటిపై ప్రశ్నించేందుకు తీసుకెళ్తున్నామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపించేస్తామంటూ అంకబాబును బలవంతంగా తీసుకెళ్లారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు రావిపాటి సాయికృష్ణ, తెదేపా కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details