తెలంగాణ

telangana

Harish Rao on Rahul Gandhi Comments : 'ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్​గాంధీ.. రాసిచ్చిన స్క్రిప్ట్‌తో ప్రసంగం'

By

Published : Jul 2, 2023, 10:59 PM IST

Harish Rao counter on Rahul Gandhi Comments : కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు నమ్మరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఖమ్మం రాహుల్ సభపై స్పందించిన ఆయన.. బీఆర్‌ఎస్‌ ఎవరికి బీ టీమ్ కాదు.. సీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేవలం రూ.70-80 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Harish Rao
Harish Rao

'బీఆర్‌ఎస్‌ ఎవరికీ B టీం కాదు.. ప్రజల సంక్షేమం చూసే Aక్లాస్ టీం'

Rahul Gandhi speech at Khammam Congress meeting : అవినీతికి మారుపేరుగా కాంగ్రెస్‌ పార్టీ మారిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. సోమాజీగూడలోని ఓ హోటల్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం.. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు.

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదని అన్నారు. తమ పార్టీ పేద ప్రజలకు ఏ టీం.. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం అని స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని.. బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని హరీశ్‌ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 80 వేల 321.57 కోట్లు అయితే.. అవినీతి రూ.లక్ష కోట్లు అని అనడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేద‌ని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ చేస్తుంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇంకా ఏం ఇస్తుందని ధ్వజమెత్తారు. అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ అని విమర్శించారు. 'ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్‌తో రాహుల్ ప్రసంగం' అని ఎద్దేవా చేశారు.

"కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరు. బీఆర్‌ఎస్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. కాళేశ్వరంపై కేవలం రూ.70-80 వేల కోట్లు ఖర్చు చేశాం. రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని కాంగ్రెస్ బురద చల్లుతుంది. కాంగ్రెస్ చేసేవన్నీ బురద రాజకీయాలే. రాహుల్ గాంధీ పాత స్క్రిప్ట్‌నే చదివి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ ఎవరికి బీ టీమ్ కాదు.. సీ టీమ్ కాదు."- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

అంతకు ముందు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌రావు ప్రాణదానం చేసే వైద్యులకు, దేశాన్ని కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు సమాజంలో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారని కొనియాడారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల్ని చాలా వరకు తగ్గించామన్నారు. అలాగే రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో 130 పరీక్షలను 24 గంటల్లో డయాగ్నసిస్ ఫలితాలు అందించేలా తయారు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details