తెలంగాణ

telangana

Venkaiah Naidu: 'మహనీయుల చరిత్ర భవిష్యత్తు తరాలకు అవసరం'

By

Published : Jul 13, 2021, 4:05 PM IST

హైదరాబాద్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పలువురు రచయితలు కలిశారు. తాము రచించిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు. సమాజానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

venkaiah naidu
ఉపరాష్ట్రపతి

దేశంలో భాష, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజలకు దిశానిర్దేశం చేసిన మహనీయుల జీవితాల గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు రచయితలు తాము రాసిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన వివిధ పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ... ఉపరాష్ట్రపతికి అందజేశారు. పీవీ దేశానికి చేసిన సేవలు యువతకు తెలియజేసేలా పరిశోధనాత్మకంగా ఈ పుస్తకాలను ప్రచురించే చొరవ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.

ఇదే మార్గంలో మరిన్ని పుస్తకాలను అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. దక్కన్​ ప్రాంతంలోని ఉర్దూ రచయితల జీవిత విశేషాలు తెలియజేస్తూ ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తేకార్ రచించిన "జెమ్స్ ఆఫ్ దక్కన్" పుస్తకం ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఉర్దూ భాషను అమితంగా అభిమానించే వారిలో తానూ ఒకరినన్న ఉపరాష్ట్రపతి... భవిష్యత్‌ తరాలు తెలుసుకోవలసిన విశేషాలతో మంచి పుస్తకం అందించిన వారికి అభినందనలు తెలిపారు.

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు...

శ్రీరాముడిని ఆదర్శ పురుషునిగా చూపిన 16 గుణాలను రామాయణంలో వివిధ సందర్భాల్లో ఆవిష్కరించిన విధానం వివరిస్తూ... సత్యకాశీ భార్గవ రాసిన "మానవోత్తమ రామ" పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి స్వీకరించారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ఓ ప్రతిబింబంగా... పితృవాక్పరిపాలకుడిగా... సత్యవాక్పరిపాలకుడిగా... ఏకపత్నీవ్రతుడిగా... సోదరులకు, తనను నమ్మిన వారికి ఆప్యాయత పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా మనకు ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడి 16 గుణాలను ఆవిష్కరించిన రచయితను ఉపరాష్ట్రపతి అభినందించారు.

గ్రామీణ ప్రజల జీవన విధానం సంస్కృతి... ప్రత్యేకించి నల్గొండ జిల్లా ప్రజల జీవన విధానం నేపథ్యంలో తాను రచించిన నల్గొండ కథలు పుస్తకాన్ని యువ రచయిత మల్లికార్జున్.. ఉపరాష్ట్రపతికి అందజేశారు. కథలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ప్రజల జీవన విధానం, మనసులను పుస్తకంలో ఆవిష్కరించిన రచయితకు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి:ts cabinet meeting: ఇవాళ మంత్రివర్గం భేటీ.. ఉద్యోగ భర్తీకి ఆమోద ముద్ర!

ABOUT THE AUTHOR

...view details