తెలంగాణ

telangana

డాక్టర్‌కు లవ్‌ సమస్య.. గూగుల్‌ సెర్చ్‌ చేస్తే ఖాతా ఖల్లాస్‌ అయిందిలా

By

Published : Jan 12, 2023, 3:24 PM IST

Updated : Jan 12, 2023, 3:39 PM IST

Hyderabad Cyber Crimes: సైబర్ నేరాలు మీతిమీరుతున్నాయి. ఆఫర్లు, బహుమతుల పేరిట లింక్‌లు పంపడం, మాయమాటలు చెప్పడం ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వైద్యురాలు తన ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు.. అంతర్జాలంలో దొరికిన ఓ నంబర్​కు ఫోన్​ చేసింది. దీంతో ఆమె సమస్యను పరిష్కారిస్తామని అందినకాడికి దోచుకున్నారు.

cyber criminals
cyber criminals

Hyderabad Cyber Crimes: తినే తిండి.. వేసుకునే దుస్తులు.. చూసే సినిమా.. చూపించుకోవాల్సిన వైద్యుడు.. అవసరం ఏదైనా సరే గూగుల్‌ సెర్చ్‌నే ఆశ్రయిస్తున్నారంతా.. ఈ అన్వేషణ వెనుక మాటేస్తున్న సైబర్‌ నేరగాళ్లు సమాచారార్థులకు వల విసురుతున్నారు. మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. ఏమైందో అర్థమయ్యేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా ఓ మహిళా డాక్టర్ ప్రేమ సమస్య నుంచి బయట పడేందుకు గూగుల్‌ను ఆశ్రయించింది. ఇంకేముందీ.. సైబర్ నేరగాళ్లకు చిక్కి.. ఖాతా ఖల్లాస్ చేసుకుంది. అదేంటో చూద్దాం.

ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు గూగుల్‌లో మాంత్రికుడి కోసం వెతికిన వైద్యురాలికి నైజీరియన్‌ రూ.సుమారు 12.45 లక్షలు టోకరా వేశాడు. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పారిపోయినట్లు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఎస్వీ హరికృష్ణ తెలిపారు. నైజీరియాకు చెందిన ఒక్వుచుక్వు(41), జోనాథన్‌ ఉజక(35), మైఖేల్‌ అజుండా, డేనియల్‌, వస్త్రాల వ్యాపారం నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చి నష్టపోయారు.

cyber criminals

సులువుగా డబ్బు సంపాదించేందుకు దిల్లీ కేంద్రంగా మోసాలు ప్రారంభించారు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్‌నెట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోన్‌ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయమాటలతో నమ్మించి డబ్బు లాగుతున్నారు. కుషాయిగూడకు చెందిన కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు సలహాలు, పరిష్కారం కోసం గూగుల్‌లో వెతికారు. ఓ ఫోన్‌ నంబరు కనిపించడంతో ఫోన్‌ చేయగా.. ఉగాండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తానంటూ మభ్యపెట్టారు. రూ.12.45 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా ఒక్వుచుక్వు, ఉజకలను దిల్లీలో అరెస్టు చేశారు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టినా... సైబర్ నేరగాళ్లు మాత్రం ఏదో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. హెచ్చరికలు జారీ చేయడం, సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా సలహాలు, సూచనలు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ... సైబర్‌ ఉచ్చులో పడిపోతున్నారు.

జాగ్రత్తలే ముఖ్యం: ప్రతి దానికీ సెర్చ్‌ మీద ఆధారపడకుండా ఏదైనా ఉత్పత్తి కొన్నప్పుడు దానికి సంబంధించి బిల్లు, లేబుల్‌ వంటివాటిని జాగ్రత్త చేసుకుంటే వాటిపై వెబ్‌ చిరునామా, కాల్‌సెంటర్‌ వివరాలు ఉంటాయి. అప్పుడు మోసానికి అవకాశం ఉండదు. కచ్చితమైన వెబ్‌ చిరునామా తెలిస్తే దాన్ని గూగుల్‌ సెర్చ్‌లో కాకుండా సరాసరి అడ్రస్‌బార్‌లో ఎంటర్‌ చెయ్యడం ద్వారా నకిలీల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 12, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details