తెలంగాణ

telangana

ఆయన మేడ్చల్‌కే మంత్రి కాదు: మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తగళం

By

Published : Dec 19, 2022, 3:45 PM IST

Updated : Dec 19, 2022, 5:07 PM IST

BRS MLAs on Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెరాస ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గానికే తీసుకెళ్తున్నారంటూ విమర్శలు గుప్పించిన శాసనసభ్యులు.. కలుపుకొని వెళ్లడం లేదంటూ ఆరోపించారు. మంత్రి వైఖరితో తమ నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోయారు.

BRS MLAs on Minister Mallareddy
BRS MLAs on Minister Mallareddy

మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తగళం

BRS MLAs on Minister Mallareddy : నామినేటెడ్ పదవులు సహా ఇతర అంశాలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తెరాసలో ముసలం పుట్టించాయి. మంత్రి మల్లారెడ్డిపై జిల్లా శాసనసభ్యులు తమ అసంతృప్తి ప్రకటించారు. జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు నాలుగు గంటలకుపైగా సమావేశమై.. మంత్రి వైఖరి, తమకు, తమ నియోజకవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై సుధీర్ఘంగా చర్చించారు. దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసం భేటీకి వేదికైంది. ఆయనతో పాటు ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు సుభాశ్‌రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ సమావేశంలో పాల్గొన్నారు.

వివిధ కారణాలతో గత కొన్నాళ్లుగా మంత్రి మల్లారెడ్డితో ఈ శాసనసభ్యులకు సమస్యలున్నాయి. తాజాగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి నియామకం నేపథ్యంలో వివాదం రాజుకొంది. దీంతో ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి అందరినీ కలుపుకొని పోవడం లేదని, అధిష్ఠానం ఆదేశాలకు విరుద్ధంగా పదవులన్నింటినీ తన సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తమ తమ నియోజకవర్గాలకు ఎలాంటి పదవులు దక్కడం లేదని.. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోయారు.

సీఎం చెప్పినా పట్టించుకోవట్లే..: సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదంటూనే శాసనసభ్యులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. తాము మీడియాకు సమాచారం ఇవ్వలేదని.. ఏ మంత్రి పంపారో కూడా తెలుసంటూ మల్లారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందరితో మాట్లాడాలని, అందరినీ కలుపుకొని పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే తాము సమావేశమైనట్లు తెలిపారు.

కేసీఆర్‌, కేటీఆర్‌కు చెబుతాం..: పదవుల విషయంతో పాటు తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం, వ్యతిరేకులను ప్రోత్సహించడం లాంటి వాటిపై మంత్రిపై శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కూడా సమావేశానికి పిలవలేదు. అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

ఇవీ చూడండి..

సాగుబండి.. లాగేది రైతు కూలీలేనండి..!

పెరిగిన వెయిటింగ్‌ లిస్ట్‌... ఇక సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేదెలా?

Last Updated :Dec 19, 2022, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details