తెలంగాణ

telangana

Bjp Focus on Elections: అధికారమే లక్ష్యం... ఇప్పటికే 60 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు!

By

Published : Mar 19, 2022, 5:12 AM IST

Bjp Focus on Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ... భాజపా సన్నద్ధమవుతోంది. 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న ఆ పార్టీ బలమైన అభ్యర్థుల కోసం ఆన్వేషిస్తోంది. ఇందుకోసం ఆపరేషన్‌ ఆకర్ష్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 60 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ స్థానాలపైనా పార్టీ దృష్టి సారించింది.

Bjp
Bjp

Bjp Focus on Elections: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న భాజపా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో అప్రమత్తమైంది. అధికార తెరాస కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచార సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో... ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలకు ఛైర్మన్‌లు, సభ్యులను నియమించింది. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనకు చేసుకునేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్య నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

జనగామలో సభ...

ఈ నెల చివరలో జనగామలో జరిగే బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. వచ్చే నెలలో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజు బండి సంజయ్‌ చేపట్టనున్న రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను అమిత్‌ షా ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభం రోజు జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా సమక్షంలో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు కమలం పార్టీలో చేరుతారని పార్టీవర్గాలు తెలిపాయి. అమిత్‌షా పర్యటనకు సంబంధించి ఈ నెల 22న 200మందితో సన్నాహాక సమావేశం నిర్వహించనున్నారు.

అసంతృప్త నేతలతో చర్చలు...

బలమైన అభ్యర్థుల కోసం ఆన్వేషిస్తోన్న భాజపా... తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లోని ప్రజా, ఆర్థిక బలం ఉన్నఅసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఇప్పటికే ప‌లుమార్లు రాష్ట్ర నాయ‌క‌త్వం స‌మావేశమైనట్లు తెలుస్తోంది. భువనగిరిలో జిట్టా బాల‌కృష్ణా రెడ్డి చేరిక‌తో నియోజకవర్గంలో పట్టు పెరిగిందని భావిస్తోంది. నల్గొండలోనూ బలమైన నేతలు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఖ‌మ్మంలో తెరాసపై అసంతృప్తితో ఉన్న నేతలు భాజపాలో చేరతార‌ని చ‌ర్చసాగుతోంది.

వాటిపై ప్రత్యేక దృష్టి...

ఇప్పటి వరకు ఒక్కసారి గెలవని ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై భాజపా దృష్టి సారించింది. నల్గొండలో నేడు జోనల్‌ సమావేశం నిర్వహించనుంది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ఇంఛార్జ్‌లతో నిర్వహించే ఈ సమావేశానికి... భాజపా జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్‌ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మిగతా జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌లతో బండి సంజయ్‌ హైదరాబాద్‌లో ఆదివారం సమావేశం అవుతారు. పార్టీ బలోపేతంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.


ఇదీ చదవండి: వీళ్ల హోలీ కొంచెం వెరైటీ... రంగులతో పాటు దెబ్బలూ తినాలి!


ABOUT THE AUTHOR

...view details